ములుగుటౌన్, డిసెంబర్ 14 : ఆధార్ను అప్ డేట్ చేసుకోవాలని కలెక్టర్ ఎస్ కృష్ణ అదిత్య అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు, పౌర సేవలను పొందాలనుకునేవారు ఆధార్ అప్డేట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆధార్ ఆధారంగా కొనసాగుతున్న సేవలకు భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్డు వివరాలు పునరుద్ధరించుకోవాలని పేర్కొన్నారు. 18 సంవత్సరాల్లోపు వారరి ఆధార్ నమోదు, నవీకరణ వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పుట్టిన పిల్లలు ఆధార్ పొందేలా దవాఖానల్లోనే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో వంద శాతం పూర్తికి కార్యాచరణ చేయాలన్నారు. 15 సంవత్సరాల్లోపు పిల్లలకు ఆధార్ అప్డేట్ ప్రక్రియ రెండుసార్లు ఉచితంగా చేసుకునే అవకాశం ఉందన్నారు. వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1947, help@uidai.net.in వెబ్సైట్ను వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, డీఆర్వో రమాదేవి, యుఐడీఏఐ హైదరాబాద్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి అప్పయ్య, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, డీఈవో పాణిని, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్, ఎల్డీఎం రాజ్కుమార్, పోస్టల్ ఇన్స్పెక్టర్ విజయ్, డిస్ట్రిక్ట్ మేనేజర్ సమాజి దేవేందర్, మీ సేవ డీఎం రాకేశ్, సూపరింటెండెంట్ రవీందర్, మీ సేవ మేనేజర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
వీసీలో పాల్గొన్న కలెక్టర్..
అలాగే, ఓటరు దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, డీఆర్వో రమాదేవి, డీటీ విజయ్కుమార్, ఆపరేటర్ సాయి తదితరులు పాల్గొన్నారు.