ఏటూరునాగారం, జనవరి 4 : రానున్న ఎన్నికల్లో ములుగు గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురాలని జడ్పీ చైర్మన్, నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీశ్వర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మండలకేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో బీఆర్ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ మాట్లాడుతూ దేశంలో మార్పు తీసుకురావడమే బీఆర్ఎస్ లక్ష్యమన్నారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అందించాలనే సంకల్పంతో కేసీఆర్ ఉన్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడా పారిశ్రామిక వేత్తలకు లాభం చేస్తున్నదని ఆరోపించారు.
ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పాటైన ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతున్నదని, ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఇప్పటికైనా మేలుకోకపోతే కార్పోరేట్ చేతుల్లోకి దేశం వెళ్లే ప్రమాదం ఉందన్నారు. మనల్ని బదనాం చేయాలని చూస్తున్నారని, వారి కుట్రలను ఛేదించి ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ములుగు నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఎదురులేదన్నారు. అర్హులకు దళితబంధు తప్పకుండా వస్తుందని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అధినాయకత్వం అండగా ఉంటుందని తెలిపారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి వెయ్యి ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, జడ్పీ కో ఆప్షన్ సభ్యురాలు వలియాబీ, ఎంపీపీ అంతటి విజయ, వైస్ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కూనూరు అశోక్, నాయకులు తుమ్మ మల్లారెడ్డి, కూనూరు మహేశ్, ఖాజాపాషా, లొట్టపెట్టల రాజేశ్, పర్వతాల రమేశ్, కుమ్మరి చంద్రబాబు, జాడి భోజారావు, దన్నపునేని కిరణ్, పోగుల లక్ష్మీనారాయణ, మల్లెల మూర్తి, చిన్ని కృష్ణ,బట్టు రమేశ్, ఈసం స్వరూప, బండి లక్ష్మి పాల్గొన్నారు.
ప్రెస్ క్లబ్ భవనానికి రూ. 10లక్షలు
ఏటూరునాగారంలో ప్రెస్క్లబ్ భవనానికి రూ. 10 లక్షలు కేటాయించనున్నట్లు జడ్పీ చైర్మన్ జగదీశ్వర్ హామీ ఇచ్చారు. అందుకు అవసరమైన స్థలం సేకరించుకోవాలని, తాను కూడా సహకరిస్తానన్నారు. నిధులు వచ్చే బడ్జెట్ నుంచి ఇస్తానని తెలిపారు. అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చేందుకు తన వంతు సహాయం చేస్తానని తెలిపారు.
సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
మండలంలోని చిన్నబోయినపల్లిలో రూ.30లక్షలతో సీసీ రోడ్ల పనులను జడ్పీ చైర్మన్ జగదీశ్వర్ బుధవారం ప్రారంభించారు. ఎన్నికల హామీలో భాగంగా హనుమాన్నగర్లో తన నిధుల నుంచి రూ. 30లక్షలు కేటాయించినట్లు తెలిపారు. అంతకుముందు గోదావరి వరద ముంపు బాధితులు వేసుకున్న గుడిసెల ప్రదేశాన్ని పరిశీలించారు. కాగా, అటవీశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు బాధితులు జడ్పీ చైర్మన్కు తెలిపారు. కలెక్టర్తో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు.