ములుగు, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ప్రగతిలో ములుగు ముందంజలో ఉంది. ములుగు ప్రాంతం గతం లో ఇనుప బూట్ల చప్పుళ్లు, తుపాకీ తూటాల మోతతో వినిపించేది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఏజెన్సీవాసులు బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీసేవారు. అప్పటి ప్రభుత్వాలు శాంతిభద్రతల బూచిని చూపుతూ ములుగు అభివృద్ధిని గాలికి వదిలేశారు. వారి పాలనలో ములుగు వెనుకబడి పోయింది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ 2014 నుంచి ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఐటీడీఏ, ఇతర శాఖల ద్వారా గిరిజన గూడాలు, తండాలు, గ్రామాలకు రోడ్లు వేసి రవాణ సౌకర్యాలు మెరుగు పర్చారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో తొలిసారిగా ములుగు మండలం కాసీందేవిపేట గ్రామానికి చెందిన 30మంది ఎస్సీ కుటుంబాలకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేశారు. తండాలు, గూడాలను జీపీలుగా మార్చడంతో ములుగులో 38 కొత్త జీపీలు ఏర్పాటయ్యాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రెండేళ్లకోసారి రూ. 80 కోట్లను కేటాయించి శాశ్వత ప్రాతిపదికన భక్తులకు సౌకర్యాలు కల్పించారు. అలాగే గోదావరి నదిపై ముళ్లకట్ట వద్ద అంతర్రాష్ట్ర వంతెన నిర్మించారు. దీంతోఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ర్టాల నుంచి రవాణా మెరుగై ములుగు ప్రాంతంలో వ్యాపార వాణిజ్యాలు పెరిగాయి.
స్వరాష్ట్రంలో తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు ఎమ్మెల్యేగా అజ్మీరా చందూలాల్ గెలుపొందారు. అప్పటి నుంచి ములుగు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి ఊపందుకున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం జగ్గన్నగూడెం-సర్వాపురం గ్రామాల మధ్య ఉన్న బొగ్గుల వాగు, అంకన్నగూడెం, జగ్గన్నగూడెం, లాయిగూడెం, సర్వాపురం వాగులపై హైలెవల్ వంతెన నిర్మించి ఆయా గ్రామాల ప్రజల కష్టాలను తీర్చింది. అదేవిధంగా జగ్గన్నపేటలో రూ.4కోట్లతో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలకు అధిక నిధులు కేటాయించి కార్పొరేట్ తరహాలో తరగతి గదులను నిర్మించారు. ములుగులో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. జగ్గన్నపేట జీపీ భవనాన్ని రూ.18లక్షలతో నిర్మించారు. అదేవిధంగా ములుగు నియోజకవర్గంలోని వివిధ పీలకు పక్కా భవనాలను నిర్మించేందుకు రూ.3 కోట్లను గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిధులు కేటాయించారు. రూ. 2కోట్లతో ములుగులో ఆడిటోరియం, గిరిజన, ఎస్సీ కమ్యూనిటీ భవనాలను నిర్మించారు. చందూలాల్ మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం రూ.10 కోట్లతో ములుగు, మంగపేట మార్కెట్ యార్డుల్లో గోదాములు నిర్మించారు. ములుగు మండలంలోని జగ్గన్నపేట, చిన్నగుంటూరుపల్లి, ఏటూరునాగారం మండలంలోని ఎక్కెల, ఎస్సీ కాలనీ, మంగపేట మండలంలోని మల్లూరులో 300 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మింపజేశారు. ఏటూరునాగారం మండలంలోని ఊరట్టం నుంచి కొండాయి మీదుగా ఐలాపురం రూ.19 కోట్లు, ముప్పనపల్లి నుంచి బుట్టాయిగూడెం వరకు రూ.4కోట్లు, ఏటూరునాగారం నుంచి తుపాకులగూడెం వరకు రూ.37కోట్లతో 40కిలో మీటర్ల డబుల్ రోడ్డు వేశారు. దొడ్ల, కొండాయి మధ్యలో ఉన్న జంపన్నవాగు వద్ద రూ.5కోట్లతో బ్రిడ్జి నిర్మించారు. బండారుపల్లి మీదుగా గణపురం క్రాస్ రోడ్డు వరకు రూ.8కోట్లతో బీటీ రోడ్డును సింగిల్ రోడ్డుగా ఉన్న బీటీ రోడ్డును డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేశారు. చందూలాల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పర్యాటక శాఖ ద్వారా రూ.15కోట్లతో గట్టమ్మ, మేడారం, మల్లూరు, తాడ్వాయి మండల కేంద్రాల్లో హరిత హోటళ్లను ఏర్పాటు చేశారు. గోవిందరావుపేట మండలం లక్నవరంలో సైతం రూ.6కోట్లతో కాటేజీలు నిర్మించారు.
స్వరాష్ట్రంలో ములుగు జిల్లాలో విద్య, వైద్య సదుపాయాలు మెరుగుపడ్డాయి. ములుగు జిల్లా కేంద్రంతో పాటు ఏటూరునాగారంలో 2014వరకు 30 పడకల దవాఖానలు మాత్రమే ఉండేవి. స్వరాష్ట్రంలో ఈ రెండు దవాఖానలను 100 పడకలుగా మార్చి వైద్యులు, సిబ్బందిని నియమించి మెరుగైన వైద్య సేవలందిస్తున్నది. ఆ తర్వాత అన్ని మండలాలతో పాటు మేడారంలో పీహెచ్సీలను ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నది. పల్లె దవాఖానలను సైతం ఏర్పాటు చేసి గ్రామస్తులకు వైద్యం చేరువ చేసింది. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ దవాఖానను అప్గ్రేడ్ చేసి ఐసీయూ, సీటీ స్కానింగ్ వంటి విలువైన సేవలను అందిస్తున్నారు. కేసీఆర్ కిట్లను అందిస్తూ ప్రభుత్వ దవాఖానలో కాన్పుల శాతాన్ని పెంచారు. జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేసి నిర్మాణ పనులకు సైతం శంకుస్థాపన చేశారు. ములుగు మార్కెట్ యార్డులో రూ.54 కోట్లతో 300 పడకల దవాఖాన, మెడికల్ కాలేజీ అనుబంధ దవాఖాన నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. టీ డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు 58 రకాల విలువైన ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. రేడియాలజీ హబ్ ద్వారా సీటీ స్కానింగ్, మమోగ్రఫీ వంటి పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఏటూరునాగారంలో రూ.8కోట్లతో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేసి రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. విద్యలో ‘మన ఊరు -మనబడి’ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో 90 పాఠశాలలను ఆధునీకరించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యా బోధన అందిస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 2019లో ములుగులోని 7మండలాలతో పాటు భద్రాచలం నియోజకవర్గంలోని రెండు మండలాలను కలుపుకొని తొమ్మిది మండలాలతో ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ములుగు అభివృద్ధి మరింత వేగవంతమైంది. రూ.58కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన 30 ఎకరాల స్థలంలో అధునాతన సౌకర్యాలు కలిగిన సమీకృత కలెక్టరేట్ నిర్మాణం జరుగుతున్నది. దీని పక్కనే రూ.40కోట్ల నిధులతో జిల్లా పోలీస్ కార్యాలయం సైతం ఏర్పాటు కానున్నది. అదేవిధంగా జిల్లాలో రూ.20కోట్లతో మేడారం, ములుగు, కన్నాయిగూడెంలలో మోడల్ పోలీస్స్టేషన్లను నిర్మించారు. రాష్ట్ర విభజన హామీలో భాగంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు 318 ఎకరాల భూమిని కేంద్ర మానవ వనరుల శాఖ అధికారులకు అప్పగించారు. దీంతో ములుగు జిల్లాకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇటీవల ఏటూరునాగారాన్ని ప్రత్యేక రెవెన్యూ డివిజన్, మల్లంపల్లిని ప్రత్యేక మండలంగా ఏర్పాటుకు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ప్రపంచ వారసత్వ సంపదగా రామప్పకు చోటు దక్కేలా కృషి చేసింది. దీంతో పాటు ఆలయంలో మౌలిక వసతుల కోసం రూ.100 కోట్లను ఖర్చు చేసి పలు అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టింది.