మహబూబాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితను పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఖరారు చేశారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధి ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లంబాడాల నుంచి దేశంలోనే తొలి మహిళా ఎంపీగా గుర్తింపు పొంది.. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధి నాయకులతో కలుపుగోలుగా ఉంటూ పాలనలో సమర్థవంతంగా ముందుకెళ్తున్న ఆమె నాయకత్వ పటిమను చూసి కేసీఆర్ మరోమారు అవకాశం ఇచ్చారు.
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లిలో 1980, జనవరి 1న కవిత జన్మించారు. బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేశారు. తన తండ్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనరల్ స్థానంగా ఉన్న మహబూబాబాద్ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. అవకాశం కలిసిరావడంతో 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో తిరిగి ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్నాయక్ చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. 2019లో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్పై 1.50 లక్షల మెజార్టీతో గెలుపొందారు. కాగా, రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం మహబూబాబాద్ స్థానం నుంచి మరోమారు ఆమె అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది.
మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి ప్రధాన పార్టీల కంటే ముందుగానే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడంతో స్థానిక నేతల్లో జోష్ నెలకొంది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీలకు చెందిన ముఖ్య నాయకులు ఇందులో పాల్గొనగా, అభ్యర్థి ఎంపికపై చర్చించారు. వారి అభిప్రాయాలను సేకరించిన అనంతరం మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత పేరును అధినేత కేసీఆర్ ప్రకటించారు.
త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్పై గులాబీ జెండా ఎగరేయాలని నాయకులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014, 2019లో వరుసగా బీఆర్ఎస్ పార్టీ మానుకోట పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకున్నదని, త్వరలో జరిగే ఎన్నికల్లో కూడా విజయం సాధించి, హ్యాట్రిక్ కొట్టేలా చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే పలు సర్వేల్లో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ గెలుస్తుందని తేల్చాయని, నాయకులు సమన్వయంతో పనిచేసి మరోమారు అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు రాష్ర్టానికి చేసిందేమీ లేదనే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు.
అదేవిధంగా ఇటీవల అనేక అసత్య వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, సంక్షేమ పథకాల అమలులో చేస్తున్న జాప్యాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. అందరూ కష్టపడి పనిచేసి మానుకోటపై మూడోసారి గులాబీ జెండా ఎగరేయాలన్నారు. ఎంపీ కవిత మాట్లాడుతూ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మరోమారు తనకు అవకాశం ఇచ్చిన అధినేత కేసీఆర్కు ఎంపీ కవిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్సీలు సత్యవతిరాథోడ్, తకళ్లపల్లి రవీందర్రావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, రెడ్యానాయక్, శంకర్నాయక్, హరిప్రియానాయక్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, బడే నాగజ్యోతి పాల్గొన్నారు.