కమలాపూర్, జనవరి 29 : రాష్ట్రంలో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూపాయి సాయం చేయకున్నా మంచిదే కాని, అడ్డుకునే ప్రయత్నం మానుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 31న కమలాపూర్లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఆదివారం ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి, కలెక్టర్ ఆర్జీ హన్మంతుతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, తెలంగాణ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఇతర రాష్ర్టాల్లోని ప్రజలు తెలంగాణలో అమలవుతున్న పథకాలు తమకు కావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం 24గంటల కరంటు, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలు అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలను ఆదుకుంటున్నారని తెలిపారు.
మోటర్లకు మీటర్లు పెడితేనే కేంద్ర ప్రభుత్వం రూ.30వేల కోట్లు ఇస్తామంటూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని, కేంద్రం తీరును రైతు లు గమనించాలని సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటూ కమలాపూర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందన్నారు. గతంలో కరంటు, సాగు, తాగునీటి కోసం రోడ్డెక్కి ధర్నాలు చేసేదని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రూ. 40వేల కోట్లతో ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు అందిస్తున్నారని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో కమలాపూర్ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని, ముఖ్యమంత్రికి ఇక్కడి ప్రజలపై అమితమైన ప్రేమ ఉన్నదని, అందుకే కోట్ల రూపాయలు వెచ్చించి నూతన భవనాలను నిర్మిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ సీఎం కాకముందు, అయ్యాక కమలాపూర్ ఎలా ఉందో స్థానికులు ఆలోచన చేయాలన్నారు.
ఈ నెల 31న కరీంనగర్ నుంచి ఉదయం 11 గంటలకు మంత్రి కేటీఆర్ కమలాపూర్కు హెలిక్యాప్టర్లో వస్తారని, అనంతరం ర్యాలీగా బయల్దేరి సుమారు రూ. 49కోట్లతో చేపట్టనున్న ఎంజేపీ గురుకుల విద్యాలయం, కస్తూర్బా గాంధీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, డబుల్ బెడ్రూం ఇండ్లు, కుల సంఘం భవనాలు, బస్టాండ్ నిర్మాణం, అయ్యప్ప ఆలయం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఆర్డీవో వాసుచంద్ర, డీఆర్డీవో శ్రీనివాస్కుమార్, డీపీవో జగదీశ్వర్, ఎంపీడీవో పల్లవి, తహసీల్దార్ రాణి, సింగిల్ విండో చైర్మన్ సంపత్రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణరావు, సర్పంచులు రవీందర్రెడ్డి, దేవేందర్రావు, అధికారులు ఉన్నారు.
డీపీవో, కార్యదర్శిపై మంత్రి ఆగ్రహం
మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కమలాపూర్కు వచ్చిన మంత్రి దయాకర్రావు గ్రామంలో పర్యటించారు. డ్రైనేజీల్లో మురుగునీరు పేరుకుపోయి చెత్త ఉండడం, పల్లె ప్రకృతివనం, రైతు వేదిక, గ్రామ నర్సరీ సమీపంలో పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలతో ఉండడాన్ని గమనించి డీపీవో జగదీశ్వర్ను మందలించారు. పంచాయతీ కార్యదర్శి రాజారాంను సస్పెండ్ చేయా ల్నా.. ఎన్ని రోజులకోసారి డ్రైనేజీలు శుభ్రం చేస్తున్నారు. నెలకు జీపీకి ఎన్ని నిధులు వస్తున్నాయ్.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ ఆర్టీహన్మంతు డీపీవోను పిలిచి ప్రధాన రహదారులు, బస్టాండ్ కూడలి, గ్రామంలో చెత్త లేకుండా శుభ్రం చేయించాలని ఆదేశించారు.