బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయం విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా.. స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు సుముఖంగా లేమని బీజేపీ సర్కారు తేల్చి చెప్పి యువత ఆశలకు గండికొట్టింది. ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నా నిర్మాణం సాధ్యం కాదని కరాఖండిగా తేల్చి చెప్పి తెలంగాణపై వివక్షను మరోమారు బయటపెట్టుకున్నది.
బయ్యారం, నవంబర్ 11 : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చర్లపల్లి సమీపంలోని పెద్దగుట్టతో పాటు రామచంద్రాపురం, మొట్లతిమ్మాపురం అటవీ ప్రాంతంలో 60 ప్లస్ శాతం కలిగిన ఇనుప ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తే స్థానిక యువతకు ఉపాధితో పాటు ప్రభుత్వానికి లాభదాయకంగా ఉంటుందని నాటి ప్రభుత్వ పెద్దలు భావించి విభజన చట్టంలో పొందుపర్చారు. సెయిల్ ఆధ్వర్యంలో రూ.30వేల కోట్లతో ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని చట్టంలో పేర్కొన్నారు. దీని ప్రకారం బయ్యారంలో స్టీల్ప్లాంట్ నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. కాగా, ఉక్కు పరిశ్రమ విషయంలో ఎనిమిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేసింది. విభజన హామీని నెరవేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్.. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించినా అవి బుట్టదాఖలే అయ్యాయి. పైగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారు.
ప్రైవేట్ సెక్టార్లో స్టీల్ తక్కువ ధరకు దొరుకుతున్నదని, అందువల్ల పరిశ్రమ నిర్మించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఇక్కడ నాణ్యమైన ఖనిజం లేందటూ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడారు. వాస్తవంగా చూస్తే.., బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మించేందుకు అవసరమైన నీరు, డోలమైట్, బొగ్గు, విద్యుత్ వంటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. బయ్యారం అడవుల్లో నాణ్యత కలిగిన ఇనుప ఖనిజం లక్షల టన్నుల్లో ఉన్నది. గతంలో సర్వే నిర్వహించిన జీఎస్ఐ, సెయిల్, సింగరేణి వంటి సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. బయ్యారంలో మొట్టమొదట 1954లోనే మైనింగ్ ప్రారంభమై 1969 వరకు కొనసాగింది. అప్పట్లోనే ఆక్కడి ఇనుప ఖనిజాన్ని రష్యా, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి చేశారు. ఇన్ని అనుకూలతలు ఉన్నా యువత ఆకాంక్షకు కేంద్రంలోని బీజేపీ సర్కారు పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో నేడు ప్రధాని మోదీ పెద్దపల్లి జిల్లాలోని రామగుండం వస్తుండగా, ఇప్పటికైనా దీర్ఘకాలికంగా నానుతున్న మన డిమాండ్లలో ఏవైనా నెరవేర్చుతారా అని ఉమ్మడి జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.