చెన్నారావుపేట, డిసెంబర్ 2: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మండలానికో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఉండేది. దీంతో పేద ప్రజలు నానా తంటాలు పడేవారు. టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో సైతం దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పల్లె దవాఖానలను ఆధునిక హంగులతో సిద్ధం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పల్లె దవాఖానలు ప్రారంభానికి ముస్తాబయ్యాయి. హెల్త్ అండ్ వెల్నెస్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానలను అభివృద్ధి చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కో పల్లె దవాఖానకు రూ. 20 లక్షల వ్యయంతో పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. ఇందులో సకల సదుపాయాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతి భవనంలో మూడు బెడ్లతో కూడిన వార్డు రూం, ఒక వెయిటింగ్ హాల్, స్టోరేజీ గది, ఒక నర్సింగ్ గది, ల్యాబ్, రెండు మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మిస్తున్నారు. రోగులను వీల్చైర్లో తరలించేందుకు ర్యాంప్ కూడా నిర్మించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చొరవతో మండలవ్యాప్తంగా రెండు మూడు గ్రామాలకో దవాఖాన చొప్పున భవనాల నిర్మాణం చేపట్టారు. చెన్నారావుపేటతోపాటు కోనాపురం, ఉప్పరపల్లి, పాపయ్యపేట, తిమ్మారాయిన్పహాడ్, అమీనాబాద్, జల్లి, ఎల్లాయగూడెం, ముగ్దుంపురం కలిపి తొమ్మిది పల్లె దవాఖానలను నిర్మిస్తున్నారు. ఇందులో చెన్నారావుపేటలో సర్పంచ్ కుండె మల్లయ్య, ఉప్పరపల్లిలో ఎంపీటీసీ విజేందర్రెడ్డి ఆధ్వర్యంలో భవన నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు ఏఈ రత్నాకర్ తెలిపారు. దీంతో పేదలకు ప్రభుత్వ వైద్యం మరింత చేరువ కానుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆదేశాల మేరకు నెలల వ్యవధిలోనే పల్లె దవాఖాన భవనాన్ని నిర్మించాం. ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులను సమకూర్చారు. సబ్ కాంట్రాక్టర్ బండి ఉపేందర్ అనుకున్న సమయానికి నిర్మాణ పనులు పూర్తి చేయించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దవాఖానను ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, నిధులు మంజూరు చేయించిన ఎమెల్యే పెద్దికి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్న.
– కుండె మల్లయ్య, చెన్నారావుపేట సర్పంచ్