మహబూబాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): మానుకోట పట్టణ అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మానుకోట మున్సిపాలిటీ పరిధిలో గాంధీపార్క్, పత్తిపాక రహదారిలో పర్యటించి, స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తక్కళ్లపల్లి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న గాంధీపార్క్ ఇక్కడి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నదని, కొన్నేళ్ల కిందట ఇక్కడ ఉన్న కూరగాయల మార్కెట్ తరలిపోవడంతో పార్క్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందన్నారు. అదేవిధంగా నెహ్రూ సెంటర్ నుంచి పత్తిపాక రహదారి అభివృద్ధి పనులు మధ్యలోనే నిలిచిపోయాయని, రహదారిలో ఉన్న కొన్ని ఇండ్లు వారు సెట్బ్యాక్ కాకపోవడం, కోర్టుకు వెళ్లడంతో నిర్మాణం పూర్తి కాలేదన్నారు.
మెడికల్ కళాశాలతోపాటు అనేక గ్రామాలకు వెళేందుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నట్లు తెలిపారు. పట్టణ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని, వ్యక్తిగత ప్రయోజనం కంటే ప్రజాప్రయోజనానికి ప్రాముఖ్యం ఇవ్వాలని కోరారు. రహదారి విషయంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, ప్రత్యేక చొరవతో పనులు పూర్తి చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాంమోహన్రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, సీపీఐ ఫ్లోర్లీడర్ అజయ్సారథి, కౌన్సిలర్లు ముత్యం వెంకన్న, పోతురాజు, బానోత్ రాము, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.