‘మీకు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్బాబు ఐదేళ్లలో ఏం చేసిండో చెప్పుమనండి. ఎవరైనా పని కోసం వెళ్తే ఇదేమైనా మా ప్రభుత్వమా అని తిరిగి పంపేటోడని విన్నా.. మరి అలాంటి వ్యక్తి మీకు అవసరమా? మనసున్న మనిషి పుట్ట మధూకర్ను గెలిపిస్తే మీ కలలు సాకారమవుతాయి.’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాటారం మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకు మద్దతుగా జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆమె మాట్లాడారు. కాటారంతో తనకు అవినాభావ సంబంధం ఉందని, ఉద్యమ సమయంలో కాంగ్రెస్సోళ్లు తనను వెళ్లగొట్టే ప్రయత్నం చేసినా ఇక్కడి ప్రజలు అండగా నిలిచారన్నారు. ఈ ఎన్నికలు ధర్మపోరాటంతో సమానమని, అధర్మాన్ని గెలిపించి చీకటి రోజులు తెచ్చుకోవద్దని ప్రజలను కోరారు. మధును గెలిపిస్తే నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ రూ.వెయ్యి కోట్లు ఇస్తా అని చెప్పారని, మంథనిని ఆయన దత్తత తీసుకుంటున్నారని చెప్పారు. రేపు మూడోసారి సీఎం అయ్యాక ఇది కేసీఆర్ నియోజకవర్గంగా ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కాటారం, నవంబర్ 19 : ‘మీ గడ్డపై అడుగు పెట్టడం నా అదృష్టం.. ఉద్యమం సమయంలో ఈ గడ్డపైకి వచ్చా.. ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నాం.. మీకు ఒక్క మాట చెప్పదలుచుకున్న.. 70 యేళ్ల చరిత్రలో మంథని నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న ముఖ్యమంత్రిని చూపించండి.. మొన్న నియోజకవర్గానికి వచ్చిన సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో పుట్ట మధును గెలిపిస్తే రూ.వెయ్యి కోట్లు ఇస్తా అన్నడు.. ఆయన మంథనిని దత్తత తీసుకుంటున్నాడు.. కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యాక ఐదేళ్లలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుంది.’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం బీఆర్ఎస్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభ్యర్థి పుట్ట మధు, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో కాటారానికి వచ్చినప్పుడు కాంగ్రెస్సోళ్లు తనను వెళ్లగొట్టే ప్రయత్నం చేయగా ప్రజలు వెన్నంటి ఉన్నారని ఆమె గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ ఏర్పడి సీఎం కేసీఆర్ పాలనకు పదేళ్లు అవుతున్న వేళ ఇప్పుడు వస్తున్న ఎన్నికలు ధర్మ పోరాటంతో సమానమన్నారు. ఈ ధర్మపోరాటంలో అధర్మాన్ని గెలిపించుకొని మళ్లీ చీకటి రోజులు తెచ్చుకోవద్దని కోరారు. గత ఎన్నికల్లో గెలిచిన శ్రీధర్బాబు ఒక్క సాయమైనా చేసిండా ? ఒక్కసారి ఆలోచన చేయాలని కోరారు. ఎవరైనా ఇంటికి వెళ్లి ఏదైనా పని అడిగితే… ఇదేమైనా మా ప్రభుత్వమా పని చేయడానికి అని తిప్పి పంపించేవాడని విన్నాను. మరి అలాంటి వ్యక్తి మీకు అవసరమా.. ఎలాగూ తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది కదా.. అందుకే ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పుట్ట మధు ఉంటేనే మీ కలలు సాకారం అవుతాయన్నారు. మీరు పదవి ఇవ్వకపోయినా.. పుట్ట మధన్న ఎక్కడికి పోలేదనీ, మీ మధ్యే ఉంటూ తన సేవా కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగించారన్నారు. బీఆర్ఎస్ మూడోసారి గెలువగానే పింఛన్ రూ.5 వేలు అవుతుందన్నారు.
తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకు సౌభాగ్యలక్ష్మీ ద్వారా నెలకు రూ.3 వేల భృతి, సన్న బియ్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతి సామాన్యుడికి రూ.5లక్షల బీమా పథకం కూడా వస్తుందన్నారు. ఆరోగ్యశ్రీని రూ.15లక్షలకు పెంచి ఆ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ ప్రాంతంలోని అసైన్డ్ భూములకు కూడా పూర్తి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వంట గ్యాస్ సిలిండర్ను రూ.400లకే ఇయ్యాలని నిశ్చయించుకున్నారనీ, దీంతో మోదీ ఘాతం నుంచి ఆడబిడ్డలకు విముక్తి కలుగుతుందనగానే మహిళలు పెద్ద పెట్టున నినదించారు. ఈ మంథని బిడ్డ పీవీ నరసింహారావును ప్రజలు ప్రధాని స్థాయికి తీసుకెళ్లారని, కానీ, కాంగ్రెస్ వాళ్లు ఆయన్ను ఏనాడైనా స్మరించుకుంటున్నారా? అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన పేరు మీద జయంతి కార్యక్రమాలు, విగ్రహాలు నెలకొల్పుతూ మన బిడ్డగా మనం గౌరవించుకుంటున్నామని అన్నారు.
పుట్ట మధు బుల్లెట్ లాంటి మనిషని, నేను అలాగే పిలుస్తానని, ఎందుకంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముక్కు సూటిగా మాట్లాడుతాడే తప్ప లోపల మంచి మనసు ఉన్న వ్యక్తి అన్నారు. పుట్ట మధును భారీ మెజార్టీతో గెలిపిస్తే సీఎం కేసీఆర్ చెప్పిన ప్రతి పథకం మీ ఇంటికి తీసుకవస్తాడని చెప్పారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లే ముందు ఒక్కసారి మీ ఇంట్లోని స్విచ్ ఆన్ చేయండి.. వెంటనే బుగ్గ వెలిగితే పుట్ట మధుకు ఓటు వేయండని కవితక్క సలహా ఇచ్చారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోతే గోసపడుతామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కు రాకేశ్, పార్టీ మండల అధ్యక్షుడు తోట జనార్దన్, కల్వచర్ల రాజు, జవ్వాజి తిరుపతి, కుంభం రాఘవరెడ్డి, కాళేశ్వరం దేవస్థాన చైర్మన్ లింగంపల్లి శ్రీనివాస రావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మమత, మహిళా మండలాధ్యక్షురాలు రత్న సౌజన్య, పంతకాని చంద్రకళ, లింగంపల్లి రమాదేవి, కేదారి గీత, ముఖ్య నాయకులు భూపెల్లి రాజు, జోడు శ్రీనివాస్, రామిల్ల కిరణ్, పంతకాని సడవలి, తైనేని సతీష్, కుడుదుల రాజబాపు, మార్క రాముగౌడ్, గోనె శ్రీనివాసరావు,తోట రాధమ్మ, మందల రాజిరెడ్డి, వెంకటేశ్వర్ రావు, సుదర్శన్, సమ్మయ్య, లక్ష్మారెడ్డి, రాంచందర్, రాజేంద్రచారి, శ్రీనివాస్, కిరణ్ గౌడ్, విఠల్, శంకరయ్య, సమ్మయ్య, సడవలి, శ్రీలక్ష్మీ, రజని, ప్రకాష్, శ్రీహరి, రమేశ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవిత ఎప్పుడైతే కాటారం గడ్డ మీద అడుగు పెట్టిందో.. అప్పుడే పుట్ట మధు గెలుపు ఖాయమైందని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన మ్యానిఫెస్టోలోని ప్రతి పథకాన్ని నియోజక వర్గంలో గడప గడపకు తీసుకవచ్చి మీ చేతుల్లో పెట్టే పుట్ట మశును ఈసారి గెలిపించుకోవాలని కోరారు.
మనమంతా వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి పుట్ట మధన్నను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని, మంథని నియోజక వర్గంలో గులాబీ జెండా ఎగురాలని భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి అన్నారు. గత ఎన్నికల్లో కాటారం ప్రజలు చేసిన పొరపాటుతో నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. పదవి లేకపోయినా ప్రజల కోసం పుట్ట మధన్న ప్రజల మధ్యనే ఉంటున్నాడనీ, అలాంటి వ్యక్తిని ఈసారి ఆదరించి ఆశీర్వదించాలని కోరారు.
ప్రజా ఆశీర్వాద సభ సందర్భంగా కాటారం గులాబీ మయమైంది. ఎమ్మెలల్సీ కవిత హాజరుకానుండడంతో సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలు భారీగా తరలివచ్చారు. కాటారం, మహాముత్తారం, మల్హర్, మహదేవపూర్, పలిమెల మండలాల నుంచి సుమారు పది వేల మంది సభకు రావడంతో సభా ప్రాంగణం జాతరను తలపించింది. కాటారానికి కవిత రావడంతో మహిళలు తమ ఇంటి ఆడపడుచును ఆహ్వానించినట్టుగా మంగళ హారతులు పట్టి వీర తిలకం దిద్దారు. బతుకమ్మలతో ర్యాలీగా సభా ప్రాంగణం వద్దకు తోడ్కొని వచ్చారు. ఎమ్మెల్సీ కవితక్క చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. సభ విజయవంతంతో పుట్ట మధు విజయం ఇక నల్లేరు మీద నడకే అన్నట్టుగా చర్చ మొదలైంది. సభ సక్సెస్తో నియోజక వర్గంలోని బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనొత్తేజం కనిపించింది..
40 ఏళ్లు మీ ఓట్లతో గెలిచి ఏనాడు మిమ్మల్ని పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఓట్ల కోసం గోడ గడియారాలు, పైసలతో మోసం చేసేందుకు వస్తున్నారని మరోసారి మోసపోతే గోస పడుతారని మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ అన్నారు. మంథని మట్టి బిడ్డగా, బీసీ బిడ్డగా సీఎం కేసీఆర్ తనకు మరోసారి అవకాశం ఇచ్చాడని మీ బిడ్డగా, తమ్ముడిగా నన్ను ఆశీర్వదిస్తే మీ కుటుంబ సభ్యుడిగా ఉంటానని తెలిపారు. తాను గెలిచాక రెండు పనులు పూర్తి చేస్తానని, ఒకటి సీఎం కేసీఆర్ అందించే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గడపకు తీసుకొస్తానని, పుట్ట లింగమ్మ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తానని హామీ ఇచ్చారు. మీ పిల్లలకు చదువు, భోజనాలు పెట్టించిన తనను మీ నుంచి దూరం చేసింది శ్రీధర్బాబా కాదా ? హైదరాబాద్లో ఉండి నెలకు రూ.2.75లక్షలు తీసుకొంటున్న ఆయన ఏ ఆడబిడ్డకైనా ఒక పుస్తెలు గానీ, ఓ పిల్లాడానికి పెన్ను గానీ కొనిచ్చాడా? ఎన్నికలు రాగానే అన్నదమ్ములు ఇద్దరు గోడ గడియారాలు పట్టుకొని రావడం దురదృష్టకరమన్నారు. రాత్రికి రాత్రి మా కార్యకర్తలను కొని కండువాలు కప్పడం కాదనీ, అన్నదమ్ములు ఇన్నేళ్లు ఈ నియోజక వర్గంకు చేసిన ఒక మంచి పని చెప్పమనండి అని సవాల్ చేశారు. మహదేవపూర్లో ఐటీడీఏ, చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ను సీఎం కేసీఆర్ సహకారంతో పూర్తి చేస్తానన్నారు.