జనగామ, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : జనగామ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి పేరు ఖరారైంది. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల సమన్వయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జనగామలో పల్లా గెలుపు బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి అప్పగించారు. అధిష్టానం ఆదేశం మేరకు పార్టీ అభ్యర్థి విజయం కోసం ముందుండి పనిచేస్తానని ముత్తిరెడ్డి స్పష్టం చేశారు. దీంతో జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిత్వంపై ఇన్నాళ్ల రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వివాద రహితుడిగా పేరుండి విద్యాధికుడైన పల్లాకు అధిష్టానం ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించింది. అధినేతకు విధేయుడిగా ఉంటూ రెండు పర్యాయాలు పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన ఆయన జనగామ జనరల్ స్థానం నుంచి అసెంబ్లీకి తొలిసారి పోటీ చేస్తున్నారు. కాగా, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, నారదాసు లక్ష్మణ్రావు హాజరైన సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై గులాబీ ముఖ్యనేతలకు యువనేత కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
జనంలో తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధిలో మమేకమవుతున్న పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ స్థానాలకు గెలుపే లక్ష్యంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్లను ఇప్పటికే ప్రకటించగా, వివిధ కారణాలతో జనగామ నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని పెండింగ్లో పెట్టిన అధిష్టానం ఎట్టకేలకు పల్లాకు పట్టం గట్టింది. జనగామ జిల్లాలోని మూడు స్థానాల్లో గెలుపు గుర్రాలను బరిలో నిలిపిన కేసీఆర్ మరోసారి దమ్మున్న నేతగా నిలిచారు. పల్లా పేరును ప్రకటించడం సహా ఈనెల 11న (బుధవారం) ఉదయం 11గంటలకు జనగామలోని వికాస్నగర్ వద్ద నిర్వహించే బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి సమన్వయ సమావేశంలో మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హాజరు కానున్నారు. మరోవైపు ఈనెల 16న జనగామలో ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించేందుకు సీఎం కేసీఆర్ రానుండడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది. పల్లా అభ్యర్థిత్వంతో గులాబీ పార్టీకి జిల్లాలోని మూడు సీట్లు గెలిచి ‘తీన్మార్’ కొట్టేందుకు సిద్ధమైంది. ఆయా నియోజకవర్గాల్లో జనంలో పట్టున్న వారికే బీఆర్ఎస్ అభ్యర్థులుగా పట్టం గట్టడడంతో గెలుపు ఖాయమైనా.. మెజార్టీ లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోపక్క కాంగ్రెస్, బీజేపీ మాత్రం అభ్యర్థుల విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. గ్రూపు తగాదాలతో సిగపట్లు పడుతుంటే పార్టీ క్యాడర్లో తీవ్ర నైరాశ్యం నెలకొన్నది.
1963 నవంబరు 4న ఉమ్మడి వరంగల్ జిల్లా సోడషాపల్లిలో పల్లా రాఘవరెడ్డి- అనసూయ దంపతులకు రాజేశ్వర్రెడ్డి జన్మించారు. సూర్యదేవర నీలిమతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పదో తరగతి వరకు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మల్లికుదుర్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివారు. ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసి ఫిజిక్స్లో ఓయూ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. విద్యార్థి దశ నుంచి ఉద్యమ నాయకుడిగా పనిచేసి అధినేత పిలుపుతో 2014లో బీఆర్ఎస్లో చేరారు. పల్లా పార్టీ ఆదేశాలతో 2015లో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి శాసన మండలి సభ్యుడిగా గెలుపొందారు. 2016లో ప్రభుత్వ విప్గా నియామకమయ్యారు. 2017లో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, 2018 లో శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు, 2019లో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2021లో రెండోసారి బీఆర్ఎస్ నుంచి మరోసారి ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొందారు.
పూర్తి పేరు : పల్లా రాజేశ్వర్రెడ్డి తల్లిదండ్రులు : పల్లా అనసూయ, రాఘవరెడ్డి
పుట్టిన తేదీ : 04-11-1963
స్వస్థలం : సోడషాపల్లి, హనుమకొండ జిల్లా
విద్యార్హతలు : పీహెచ్డీ
భార్య : సూర్యదేవర నీలిమ
పిల్లలు : ఇద్దరు కుమారులు
రాజకీయ ప్రవేశం :