భీమదేవరపల్లి, ఏప్రిల్ 7 : ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా గౌరవెల్లి ప్రాజెక్టు నెలరోజుల్లో పూర్తవుతుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ స్పష్టం చేశారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో మండలాధ్యక్షుడు మార్పాటి మహేందర్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్యఅతిథులుగా హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్, జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి సతీశ్ కుమార్ ప్రసంగించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తికావొచ్చాయని, 10 కిలోమీటర్ల పొడవున కట్ట నిర్మించాల్సి ఉండగా 300 మీటర్లు మాత్రమే పనులు మిగిలాయని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ ఇప్పటికే పూర్తయిందని, నెలరోజుల్లోగా సీఎం కేసీఆర్ను ఇక్కడికి పిలిపించి, ప్రారంభించుకుంటామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక లక్షా ఆరు వేల ఎకరాలకు సాగునీరందుతుందని, తద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా కొత్తపల్లి, కొప్పూరు, మాణిక్యాపూర్ గ్రామాల పంట పొలాలకు కాలువల ద్వారా నీరందుతుందని తెలిపారు. దేశంలోని 18 వరకు రాష్ర్టాల్లో బీజేపీ ప్రభుత్వం ఉందని, రైతన్నలకు ఏ ఒక్క ప్రభుత్వం రైతుబంధు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు.
బీజేపీ నాయకులవి ఝూటా మాటలని, ముఖ్యంగా యువత వారి మాయలో పడొద్దని సూచించారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టడడం వల్లే భూగర్భ జలాలు అడుగంటడం లేదన్నారు. మహిళా సంఘాలకు వడ్ల కొనుగోలు కేంద్రాలను అప్పగించి, క్వింటాల్కు రూ.2060 మద్దతు ధర నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు గుర్తు చేశారు. రైతులు మరణిస్తే రైతు బీమా పథకం వారి కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నదన్నారు. 24 గంటల విద్యుత్, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నర్సరీలు, డంపింగ్యార్డులతో పల్లెలన్నీ అద్దంలా మారాయని తెలిపారు. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు అందజేయడంతో వీధులన్నీ పరిశుభ్రంగా ఉంటున్నాయని తెలిపారు. సెల్ఫోన్లు అప్పగించాలని ఈడీ చెబితే ఎమ్మెల్సీ కవిత బాజాప్త తెచ్చి ఇచ్చారని చెప్పారు. పది పరీక్ష ప్రశ్నపత్రాల లీకులో బండి సంజయ్ అడ్డంగా దొరికారని, సెల్ఫోన్ అప్పగించాలని పోలీసులు అడిగితే మాట దాటవేశారని అన్నారు. తప్పులు చేయనప్పుడు బాజాప్త సెల్ఫోన్ పోలీసులకు అప్పగించాలని కదా అని ఎద్దేవా చేశారు.
సెల్ఫోన్ అప్పగిస్తే బీజేపీ లీకు వీరులు ఇంకెంతమంది బయట పడుతారో అనే భయం అతడికి ఉండవచ్చన్నారు. విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమ్మేళనంలో ఎంపీపీ జక్కుల అనిత, జడ్పీటీసీ వంగ రవి, మాజీ ఎంపీపీ సంగ సంపత్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి రాజిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మండల సురేందర్, ఎల్కతుర్తి సహకార సంఘం అధ్యక్షుడు శ్రీపతి రవీందర్గౌడ్, స్థానిక సర్పంచ్ మాడుగుల కొంరయ్య, ఎంపీటీసీలు అప్పని పద్మ, బొల్లంపల్లి రమేశ్, బీఆర్ఎస్ నాయకులు నవాబ్పాషా, షరీఫొద్దీన్, శనిగరం సదానందం, రచ్చ సంపత్ పాల్గొన్నారు.