హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 12 : వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యపై పార్టీలో వ్యతిరేక ఉన్నదనే విషయాన్ని వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అంగీకరించారు. ప్రతి రాజకీయ పార్టీ ప్రారంభంలో కొంత వ్యతిరేకత ఉంటుందని అన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, కె.ఆర్.నాగరాజు, ఎంపీ అభ్యర్థి కడియం కావ్యతో కలిసి శుక్రవారం ఆయన హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కడియం కావ్య ఎస్సీ కాదని అరూరి రమేశ్ మాట్లాడడం సరైనది కాదని.. ఓడిపోతానని తెలిసి కులాన్ని బయటకు తీసుకొస్తున్నారంటూ రేవూరి మండిపడ్డారు. అరూరి రమేశ్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కావ్య ఆంధ్రా అమ్మాయి అని మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ‘డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పలేదు. రుణమాఫీ చేయడానికి మాకు సంవత్సరం టైం కావాలి. రెండు లక్షల రుణమాఫీ విషయంలో ఏం చెప్పామో మీరే చూసుకోండి. మేము ఎక్కడా 100 రోజుల్లో రుణ మాఫీ చేస్తామని చెప్పలేదు.
రుణమాఫీ చేయడానికి సంవత్సరం టైం కావాలి’ అని వివరించారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ ఎన్నికల ఇన్చార్జీగా వ్యవహరిస్తున్న రేవూరి ప్రకాశ్రెడ్డి రుణమాఫీపై చేసిన వ్యాఖ్యలతో విలేకరుల సమావేశంలో ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రుణమాఫీకి ఏడాది పడుతుందని రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ‘నా వల్ల ఎదిగిన రమేశ్ నాకే వెన్నుపోటు పొడిచాడు, రాజ్యాంగం, చట్టాలపై అవగాహన లేని అరూరి రమేశ్ 10 సంవత్సరాల్లో వరంగల్ జిల్లాకు మోదీ చేసిందేమీ లేక వ్యక్తిగత విషయాలపై మాట్లాడుతున్నాడ’ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం కావ్య వరంగల్లోనే పుట్టింది.. పెరిగింది.. చదువుకున్నది.. ఉద్యోగం చేస్తున్నదని ఎస్సీ కాదని నీచమైన మాటలు మాట్లాడడం సరికాదన్నారు. టీడీపీలో సామాన్య కార్యకర్తగా ఉన్న రమేశ్కు జగిత్యాల ఎస్సారెస్పీ కాల్వ కాంట్రాక్ట్ పనులు తానే ఇప్పించానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు.