నర్సంపేట, ఆగస్టు 27 ; నర్సంపేటలో ఈ దఫా బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ ఖాయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఊహించని అభివృద్ధి జరిగిందని, పని చేసే సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ప్రతిపక్షాలకు విజన్ లేదని, వేలాది కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని, గోదావరి జలాలను ఇక్కడికి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని పేర్కొన్నారు. నన్ను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేదని, మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. –
నమస్తే : గెలిచిన తర్వాత ఏం అభివృద్ధి పనులు చేశారు?
ఎమ్మెల్యే : ఇరిగేషన్ జీరో, పవర్లో నంబర్ చేశాం. ఇంతకు ముందు 13 సబ్స్టేషన్లు ఉంటే.. ఆ సంఖ్యను 30కి పెంచా. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ అమలు చేస్తూనే ఎన్నో పైలట్ ప్రాజెక్టులను తీసుకొచ్చా. గిరిజనులు, దళితులు, వ్యవసాయ రంగానికి, రైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చాం. అనేక ప్రభుత్వ విద్యా సంస్థలను తీసుకొచ్చి నర్సంపేట నియోజకవర్గాన్ని విద్యా హబ్గా మార్చాం. నర్సంపేటలో పీఎన్జీ గ్యాస్ పెట్టాం. ఇది రాష్ట్రంలో ఎక్కడా లేదు. పట్టణంలో ఇప్పటికే 6 వేల కనెక్షన్లు తీసుకున్నారు. 14.5 కేజీలను రూ. 715కే ఇస్తున్నాం. నర్సంపేట నియోజకవర్గంలో 86 వేల కనెక్షన్లు లక్ష్యం పెట్టుకున్నాం. మొదట పట్టణానికి, రెండో విడుత డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాలకు ఇవ్వాల్సి ఉంది. తర్వాత వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు ఇస్తారు. ఇన్ని చేసినా ప్రతిపక్షాలకు అర్థమే కాలె.
నమస్తే : వచ్చే ఎన్నికల్లో మీ ఎజెండా ఏమిటి?
ఎమ్మెల్యే : వాస్తవంగా చెప్పాలంటే సీఎం కేసీఆర్ ఎజెండానే నా ఎజెండా. నియోజకవర్గంలో చిన్నాచితక, వ్యక్తిగతమైన అంశాలకు సంబంధించిన సమస్యలే తప్ప లాంగ్ రన్ ఏమీ పెండింగ్లో లేదు. నల్లబెల్లి మండలంలో హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేసి దాని ఫలితాలను ప్రజలకు అందించడం నా ముందున్న లక్ష్యం. నేను ప్రభుత్వం నుంచి తీకొచ్చిన ప్రతి పనిని ఇష్టంగా చేస్తా. ఎంత కష్టమైనా అనుభవిస్తా. ఏది చేసినా చిత్తశుద్ధి, కమిట్మెంట్తో చేస్తా. ఇతరులకు ఆ కమిట్మెంట్ ఉండదు. మెడికల్ కళాశాలను తీసుకొచ్చిన. కానీ, ల్యాండ్ లేదు. నర్సంపేటలో దొడ్డ మోహన్రావు సహకారంతో ల్యాండ్ను క్రియేట్ చేశా. దాత సహకారంతో సేకరించిన ఆ భూమితోనే జిల్లా ఆస్పత్రిని ఏర్పాటు చేయడానికి సాధ్యమైంది. అది సంపూర్ణం కావాలంటే మళ్లీ నేనే ఎమ్మెల్యేగా రావాలి. కేసీఆర్ సారే సీఎం కావాలి.
నమస్తే : మీ విజయానికి దోహదపడే అంశాలు ఏమిటి?
ఎమ్మెల్యే : ప్రతిదీ దోహదపడుతుంది. ఇరిగేషన్ రంగంలో వందశాతం పనులు పూర్తి చేశా. గోదావరి జలాలను నర్సంపేటకు రప్పించగలిగా. పాకాల, రంగాయ ప్రాజెక్టులను పూర్తి చేశా. దీనివల్ల రైతాంగానికి అదనంగా సాగునీటి వనరులను అందుబాటులోకి తీసుకొచ్చిన. దీనివల్ల గొలుసుకట్టు చెరువులు గోదావరి జలాలతో వేసవిలోనూ కళకళలాడాయి. గతంలో పూటిక, చెట్లతో నిండి ఉన్న శ్రీరాంసాగర్ కాల్వలకు కూడా మరమ్మతులు చేయించా. ఎస్సారెస్పీ జలాలతో నియోజకవర్గంలోని అన్ని చెరువులను నింపాము. ఇరిగేషన్ సర్క్యూట్ అమలు చేశా. వట్టెవాగు. మున్నేరువాగు, పాకాల వాగుపై చెక్డ్యామ్లు, వంతెనలు నిర్మించాం. దీనివల్ల భూగర్భ జలమట్టాలు కూడా పెరిగాయి. రెండు పంటలకూ సమృద్ధిగా వందశాతం నీరు అందుతున్నది. రైతులు తమ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు వీలుగా గోదాముల నిర్మాణం కూడా చేపట్టా. సబ్సిడీపై వ్యవసాయ యంత్రీకరణను అమలు చేశా. నర్సంపేట పట్టణాన్ని రూ. 50 కోట్లతో అభివృద్ధి చేశా. సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, డ్రైనేజీల నిర్మాణం, ఆడిటోరియం, పార్కులు, రోడ్లు, కుల సంఘాలకు కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నాం.
నమస్తే : ఉద్యమ జీవితానికి, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏమైనా తేడా ఉందా?
ఎమ్మెల్యే పెద్ది : ఉద్యమ జీవితానికి, ఎమ్మెల్యేగా నా జీవితానికి పెద్దగా తేడా లేమీ లేదు. ఆనాడు ప్రజల మధ్యనే ఉన్నా, ఇప్పుడు కూడా 18 గంటలు పని చేసి ప్రజల మధ్యనే ఉంటున్నా. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన వారు నియోజకవర్గ కేంద్రానికి దూరంగా ఉన్నారు. నేను మాత్రం నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించేందుకు కృషి చేస్తున్నా. సాధారణ జీవితం గడుపుతున్నా. గత పాలకులు ఒక్క హామీ కూడా నెరవేర్చలే. కానీ, నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హామీలన్నీ అమలు చేశా. పాకాల నుంచి మొదలుకొని.. రంగం ఏదైనా 100 మార్కులు వచ్చాయి. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న. ప్రతీది విజన్తో చేస్తున్న.
నమస్తే : ప్రజలకు మీరిచ్చే సందేశం?
ఎమ్మెల్యే : నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న. గతంలో ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉందో ప్రజలు గమనించాలి. విపక్షాలు చెప్పే కళ్లబొల్లి మాటలు నమ్మొద్దు. తనను ఆశీర్వదించి మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మరింత అభివృద్ధి చేసి చూపిస్తా.
నమస్తే : మరోసారి టిక్కెట్ రావడంపై మీ అభిప్రాయం?
ఎమ్మెల్యే : సీఎం కేసీఆర్ అడుగకుండానే అన్నీ ఇచ్చే గుణం ఉన్న నాయకుడు. నేను ఆరుసార్లు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగా. పొలిట్బ్యూరోలోనూ మెంబర్గా పని చేశా. జడ్పీటీసీగా రైతు నాగలి గుర్తు నుంచి నా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ సీఎం కేసీఆర్ ఇచ్చారే తప్ప నేను నోటి నుంచి అడిగిందేమీ లేదు. నోరిప్పి నేను ఏన్నడూ పదవి కావాలని అడుగలేదు. నాపై నమ్మకంతో మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్ ఇచ్చినందుకు సంతోషంగా ఉంది.
నమస్తే : ప్రతిపక్షాల గురించి మీ అభిప్రాయం?
ఎమ్మెల్యే : వారి గురించి ఎక్కువ మాటాలడడం కన్నా, మన పనిని మనం చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే వారు ఎక్కడా లైవ్లో లేరు. వారు నన్ను ఏమీ అనలేదు. నేను వారిని అనడం రాజకీయంగా కరెక్టు కాదు. నా పద్ధతికి నేను కట్టుబడి ఉన్నా. ప్రజల మధ్యకు నేనే వెళ్తున్న. ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. వివిధ పథకాల్లో లబ్ధి పొందిన వారంతా తనకు అండగా ఉంటున్నరు. అన్ని రంగాల్లో అభివృద్ధిని చూసిన ప్రజలు తమ వైపు నిలిచేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు తన వైపున వస్తున్నారు.