నర్సంపేటరూరల్, సెప్టెంబర్ 28: మత్స్యకారుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. వందశాతం రాయితీపై ప్రభుత్వం అందించిన 6.14 లక్షల చేపపిల్లలను ఎమ్మెల్యే గురువారం మాదన్నపేట పెద్ద చెరువులో వదిలారు. ఈ సందర్భంగా చెరువు వద్ద కొబ్బరికాయలు కొట్టి, పసుపుకుంకుమ, పూలు చల్లి గంగమ్మతల్లికి పూజలు చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో పెద్ది మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్య రంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. మత్స్యకారుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రమంతటా ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నదన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రత్యేక సొసైటీలు ఏర్పాటు చేసి, హక్కులు కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. నర్సంపేట నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న 338 చెరువుల్లో పోసేందుకు 87.96 లక్షల చేపపిల్లలు మంజూరైనట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ చొరవతో గోదావరి జలాల రాకతో ఈ ప్రాంతం పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్నదని వివరించారు.
నియోజకవర్గానికి ప్రత్యేక జీవో తీసుకొచ్చి వెనుకబడిన ముదిరాజ్లకు డబుల్ బెడ్రూం ఇండ్లలో అవకాశం కల్పిస్తామన్నారు. చేపపిల్లలు పోసుకునే అవకాశాన్ని సొసైటీలకే కల్పించాలని కోరుతూ త్వరలోనే సీఎం కేసీఆర్కు వినతిపత్రం అందించనున్నట్లు పెద్ది చెప్పారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి నరేశ్కుమార్నాయుడు, ఎంపీపీ మోతె కళావతి-పద్మనాభరెడ్డి, జడ్పీటీసీ కోమాండ్ల జయ-గోపాల్రెడ్డి, మాదన్నపేట సర్పంచ్ మొలుగూరి చంద్రమౌళి, ఎంపీటీసీ ఊడ్గుల రాంబాబు, జిల్లా మత్స్యశాఖ చీఫ్ ప్రమోటర్ చొప్పరి సోమయ్య, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పల్లెబోయిన అశోక్, జినుకల కొమ్మాలు, జిల్లా డైరెక్టర్లు పొన్నం మొగిలి, చింతకాయల నరేందర్, ఎఫ్సీఎస్ మాదన్నపేట అధ్యక్షుడు మారపాక నర్సయ్య, ముదిరాజ్ మండల అధ్యక్షుడు నూనె నర్సయ్య, ముదిరాజ్ జిల్లా నాయకుడు గోనెల నరహరి, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్రెడ్డి, ఎన్నారై రాజ్కుమార్, జినుకల నర్సయ్య, కౌన్సిలర్ జుర్రు రాజు, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు నామాల సత్యనారాయణ, నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, మాజీ అధ్యక్షుడు మచ్చిక నర్సయ్యగౌడ్, మోతె జయపాల్రెడ్డి, కడారి కుమారస్వామి, రాజేందర్, బోళ్ల స్వామి, వరంగంటి సంతోష్, లక్క కుమార్ పాల్గొన్నారు.
మాదన్నపేట గ్రామ శివారులోని పెద్ద చెరువు మూడో దఫా గురువారం నుంచి మత్తడి దుంకుతున్నది. ఇటీవల కురిసిన వర్షాలకు తోడు రంగయ్యచెరువు నీరంతా మాదన్నపేట పెద్ద చెరువులోకి చేరుతుండడంతో చెరువు పూర్తిగా నిండి అలుగు పోస్తున్నది. చెరువు 17అడుగుల పూర్తి సామర్థ్యంతో నిండి ఇంచు మందంతో అలుగు దుంకుతున్నది. చెరువు ముచ్చటగా మూడోసారి మత్తడి పోస్తుండడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.