భీకర వానలతో వరదలు పోటెత్తాయి. వాగులు, వంకలు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. చలివాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరకాల, భూపాలపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సంగెం మండలంలోని ఎల్గూరురంగంపేట, నర్సంపేట మండలం మాదన్నపేట చెరువు, పర్వతగిరి మండలం కల్లెడలోని చెరువు కట్టకు బుంగలు పడగా అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. గ్రేటర్ వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కన్నారం గ్రామ శివారులోని ఊర చెరువు వాగును దాటుతుండగా ఓ వ్యక్తి వరద ప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందాడు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలు పెద్ది, అరూరి, చల్లా, నన్నపునేని, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, బల్దియా కమిషనర్ రిజ్వాన్ బాషా, సీపీ రంగనాథ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో వరద పరిస్థితిని తెలుసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి తరలించారు. వరంగల్ జిల్లాలో సగటు వర్షపాతం 223.6మిమీ, హనుమకొండ జిల్లాలో 275.9 మిల్లీమీటర్లుగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
వరంగల్, జూలై 27(నమస్తేతెలంగాణ)/హనుమకొండ సబర్బన్ : భారీ వర్షం జిల్లాను ముంచెత్తింది. మునుపెన్నడూ లేని రీతిలో బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షంతో జిల్లా అతలాకుతలమైంది. వాగులు, ఒర్రెలు వరద నీటితో పొంగి ప్రవహించాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయా యి. ఈదురుగాలి, కోతకు గురై భారీ వృక్షాలు సైతం కూలిపోయాయి. చెరువులన్నీ నీటితో నిండి అలుగు పోస్తున్నాయి. లోతట్టు ప్రాంత కాలనీల్లోకి వరద నీరు చేరింది. బుంగలు పడిన కొన్ని చెరువుల కట్టలకు అధికారులు ఇసుక బస్తాలు వేశారు. గ్రామాలు, పట్టణాల్లో కొన్ని ఇండ్లు పూర్తిగా, మరికొన్ని ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పడిపోవడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. పలు గ్రామాలు, పట్టణాల్లోని కాలనీలకు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సంగెం మినహా ఇతర మండలాల్లో అత్యంత భారీ వర్షం పడింది. పదమూడు మండలాల్లో 2,906 మిమీ వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 223.6మిమీగా నమోదైంది. నల్లబెల్లి మండలంలో అత్యధికంగా 292 మిమీ వర్షం పడింది. పర్వతగిరి మండలంలోని కల్లెడలో 267, నెక్కొండలో 253.5 మిమీ వర్షపాతం నమోదైంది. రాయపర్తిలో 243.2, ఖిలావరంగల్లో 239.4, వరంగల్లో 222.8, దుగ్గొండిలో 220.4, చెన్నారావుపేటలో 215.4, వర్ధన్నపేటలో 206.4, ఖానాపురంలో 206.2, గీసుగొండలో 204.6, నర్సంపేటలో 202.4 మిమీ వాన కురిసింది. బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఏకధాటిగా కుండపోత వర్షం కురిసింది. ఈదురుగాలి తోడు కావడంతో పలుచోట్ల రహదారులపై చెట్లు కూలటం వల్ల వరంగల్- ఖమ్మం సహా పలు రూట్లలో రాకపోకలకు అంతరాయం కలిగింది. కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పడిపోవడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిన కొన్ని గ్రామాలు, పట్టణాల్లో గురువారం ఎన్పీడీసీఎల్ అధికారులు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. ఆకేరు, పాకాల వాగులు, ఒర్రెలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు రూట్లలో కాజ్వేలు, కల్వర్టుల వద్ద పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.
సహాయక చర్యలు ముమ్మరం..
గురువారం కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో వరంగల్లోని పలు కాలనీల్లో వరద నీటి ఉధృతి మరింత పెరిగింది. అధికారులు బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో వారికి భోజనం, ఇతర వసతులు కల్పించారు. కలెక్టర్ ప్రావీణ్య బుధవారం రాత్రి నుంచి ఇక్కడి పరిస్థితిని తెలుసుకుంటూ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సూచనలు చేశారు. గురువారం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బీఆర్నగర్లో వరదలో చిక్కుకున్న కొందరిని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. సాయంత్రం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎమ్మెల్యే నరేందర్, మేయరు గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను అలర్ట్ చేశారు. ప్రజలతోనూ మాట్లాడి ఇబ్బందులను తెలుసుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే, మేయర్, కలెక్టర్, కమిషనర్ ఎస్ఆర్ఆర్తోట, హంటర్రోడ్డు, రామన్నపేట, చిన్నవడ్డేపల్లి, కీర్తినగర్ నాలా, మర్రివెంకటయ్యకాలనీ, వీవర్స్కాలనీ, సీఆర్కాలనీ, లోతుకుంట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ ఏసీపీ బోనాల కిషన్, ఇతర పోలీసు అధికారులతో కలిసి వరంగల్లోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు.
చెరువుల సందర్శన..
జిల్లాలోని 815 చెరువుల్లో 810 చెరువులు నీటితో నిండి అలుగు పోస్తున్నాయి. నల్లబెల్లి మండలంలో ఒక చెరువు కట్ట తెగింది. సంగెం మండలంలోని ఎల్గూరురంగంపేట చెరువు కట్టకు బుంగ పడడంతో అధికారులు ఇసుక బస్తాలను వేశారు. నర్సంపేట మండలం మాదన్నపేట చెరువు కట్టపై ఉన్న చెట్టు కూలడంతో బుంగ ఏర్పడింది. దీంతో అధికారులు ఇక్కడ కూడా ఇసుక బస్తాలను వేశారు. సంగెం మండలంలోని నార్లవాయి గ్రామంలోని అంటుకుంట కట్టకు బుంగ పడింది. పర్వతగిరి మండలం కల్లెడలోని ఒక చెరువు కట్టకు బుంగ పడగా అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు వరద నీటితో నిండి అలుగు పోస్తుండడంతో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మత్తడి వద్ద పూజలు చేశారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంగెం మండలంలోని ఎల్గూరురంగంపేట చెరువును సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. నిండు కుండలా మారిన వర్ధన్నపేట మండంలోని కోనారెడ్డి, దమ్మన్నపేట చెరువులను ఎమ్మెల్యే అరూరి సందర్శించారు. కట్టలు కోతకు గురికాకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.
పరకాలలో రికార్డు స్థాయి వర్షపాతం..
హనుమకొండ జిల్లాలో వర్షం దంచి కొట్టింది. పరకాల మండలంలో రికార్డు స్థాయిలో 459.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురవగా, కమలాపూర్ మండలంలో 372.5 మిమీ, నడికూడ మండలంలో 332.1, ఆత్మకూరులో 293.2, శాయంపేటలో 297.8 మిల్లీమీటర్ల వాన కురిసింది. ఎల్కతుర్తిలో 285.4, హసన్పర్తిలో 237.9, ధర్మసాగర్లో 200.7, కాజీపేట్లో 241.3, హనుమకొండలో 235.9, ఐనవోలులో 228.7, దామెరలో 251.6, మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైం ది. జిల్లా వ్యాప్తంగా 275.9 మిల్లీమీటర్లు సగటు వర్షం కురిసింది. జిల్లాలోని ప్రధాన జలాశయాలన్ని అలుగు పోస్తున్నాయి. హనుమకొండలోని పలు లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. వరంగల్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, వరంగల్-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం జాతీయ రహదారుల్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, వాహనాలను దారి మళ్లిం చి ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు చూసుకున్నారు. పలు రెసిడెన్సియల్ విద్యాలయాల్లోకి కూడా నీరు చేరడంతో విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రధాన రహదారులపై కి వరద నీరు చేరడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను సురక్షిత మార్గాల వైపు మళ్లించారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండి ఎక్కడ సమస్యలు ఏర్పడ్డా సర్పంచులు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించారు. ఎన్నడూ లేని స్థాయిలో వర్షాలు కురిసినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసకోలేదంటే ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితమేనని పలువురు వ్యాఖ్యానించారు. జిల్లాలో 922 చెరువులు ఉండగా, 801 చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి.