ఖానాపురం, డిసెంబర్ 8: చివరి ఆయకట్టు వరకూ సక్రమంగా సాగునీరందేలా పూడికతీత పనులు చేపట్టాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూచించారు. మండలకేంద్రం శివారు పాకాల ఆయకట్టు పరిధిలోని తుంగబంధం పంట కాల్వలో చేపట్టిన పూడికతీత పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గురువారం పరిశీలించారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా యాసంగిలో పాకాల ఆయకట్టు కింద అత్యధిక విస్తీర్ణంలో తైబందీని ఖరారు చేసినట్లు తెలిపారు. పాకాల పంట కాల్వలైన తుంగబంధం, సంగెం, జాలుబంధం, మాటువీరారంలో పిచ్చిమొక్కలు, గుర్రపుడెక్క ఆకు మొలవడం, పూడిక పేరుకుపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొందన్నారు.
ఈ నెల 15న యాసంగి సాగు కోసం పాకాల నీటిని విడుదల చేయనున్నందున వీలైనంత త్వరగా పంటకాల్వల మరమ్మతు పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. యాసంగి సాగు చేపట్టనున్న రైతులు సకాలంలో నార్లు పోసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 10వ తేదీ తర్వాత నీటిని నిలిపివేయనున్నామని, రైతులు గమనించి ముందస్తు నాట్లకు సిద్ధం కావాలని కోరారు. ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, సర్పంచ్ ఐలయ్య పాల్గొన్నారు.
లీడ్ గ్రంథాలయం సేవలు స్ఫూర్తిదాయకం
నర్సంపేట: లీడ్ గ్రంథాలయం సేవలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణానికి చెందిన కవి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాసుల రవికుమార్ ఏర్పాటు చేసిన లీడ్ గ్రంథాలయాన్ని ఆయన సందర్శించారు. 16 ఏళ్లుగా నిస్వార్థంగా సేవలందిస్తున్న కాసుల రవికుమార్-శోభారాణి దంపతులు ఆదర్శప్రాయులన్నా రు. పది వేల పుస్తకాలతో తన ఇంటినే గ్రంథాలయంగా మార్చారని కొనియాడారు. ఏటా వేసవిలో స్పోకెన్ ఇంగ్లి ష్, గ్రామర్ తరగతులు కూడా నిర్వహిస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారని వివరించారు. అనంతరం రవికుమార్-శోభారాణి దంపతులు పెద్దిని సన్మానించారు. కార్యక్రమంలో నర్సంపేట సీఐ పులి రమేశ్, ఉపాధ్యాయులు లక్ష్మణాచారి, వీరన్న, నందగోపాల్ పాల్గొన్నారు.