వరంగల్ : ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్లోని పండ్ల మార్కెట్లో మేడారం వెళ్లే భక్తులకు ఆర్టీసీ బస్ సెంటర్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిమగల్ల తల్లులు సమ్మక్క, సారలమ్మ అని తెలిపారు. ఆ తల్లుల ఆశీర్వాదంతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలి. మేడారం జాతరకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం జాతరకు ప్రతిసారి గొప్ప ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ జిల్లా నుంచి మేడారం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 5 సెంటర్లు ఏర్పాటు చేసి 360 బస్సులను ఏర్పాటు చేశామన్నారు.
భక్తులంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ అమ్మవార్లను దర్శించుకుని వారి ఆశీర్వాదం పొందాలని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, సోమిశెట్టి ప్రవీణ్, చింతాకుల అనిల్, మాజీ కార్పొరేటర్ జారతి అరుణ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టి.రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.