ఖిలావరంగల్, మార్చి 31: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కార్పొరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు పని చేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సూచించారు. వరంగల్ 28వ డివిజన్లోని ఎల్లమ్మబజార్, దూదేకులవాడలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఇక్కడ తాగునీరు రాకపోవడంతో కార్పొరేటర్ గందె కల్పన తన సొంత ఖర్చులతో మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ను కాలనీ పైపులతో అనుసంధానం చేయించారు. ఫలితంగా కాలనీల్లో తాగునీరు సమృద్ధిగా సరఫరా అవుతున్నది. దీంతో ఎమ్మెల్యే కార్పొరేటర్ను అభినందించారు. వేసవికి ముందే తాగునీటి సమస్యను పరిష్కరించడం అభినందనీయమన్నారు. మున్ముందు డివిజన్లో అనేక అభివృద్ధి పనులతోపాటు సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పని చేయాలని నన్నపునేని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు గందె నవీన్, జెడ్ఆర్యూసీసీ సభ్యులు చింతాకుల సునీల్, కుడా డైరెక్టర్ మోడెం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్: ముదిరాజ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తున్నదని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. 12వ డివిజన్ దేశాయిపేటలో పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ముదిరాజ్ల కులదైవమైన పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ముదిరాజ్లు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో నియోజకవర్గాన్ని పరిపాలించిన నాయకులు ప్రజల సమస్యలను ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కావటి కవిత, చింతాకుల అనిల్, దిడ్డి కుమారస్వామి, జెడ్ఆర్సీ మెంబర్ చింతాకుల సునీల్, మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, ముదిరాజ్ నాయకులు, యూత్ నాయకులు శివ, రాంకీ, రాజు, పటేల్ పాల్గొన్నారు. అలాగే, ఇదే ప్రాంతంలో నాగమయ్య ఆలయానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.