వరంగల్, ఫిబ్రవరి 23: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మున్సిపల్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో జీడబ్ల్యూఎంసీ విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఇప్పుడు ముక్కుపిండి 25 రెట్ల ఆస్తి పన్ను ఫెనాల్టీలను వసూలు చేస్తున్నారు. ఇంటి నంబర్ కేటాయింపు కోసం పక్కా ఇంటి కొలతల సమాచారంతో అన్లైన్ ద్వారా సెల్ప్ అసెస్మెంట్ దాఖలు చేయాలని ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకపోవాల్సిన గ్రేటర్ అధికారులు పట్టించుకోలేదు. కొత్త చట్టం చట్టంపై పూర్తి స్థాయి అవగాహన లేని మీ సేవ కేంద్రాల నిర్వాహకులు ఇంటి యజమాని చెప్పిన కొలతలతో ధరఖాస్తు చేశారు. ఆయా కొలతలు తప్పుగా ఉండడంతో ఆ ఇంటిపై వచ్చే అసలు ఆస్తి పన్నుకు 25 రెట్లు జరిమానా విధించారు. దీంతో గ్రేటర్ పరిధిలోని సుమారు రెండు వేల మంది పేదలు, గుడిసెవాసులు లబోదిబో మంటున్నారు. ఆస్తి పన్ను మదింపు కోసం దరఖాస్తు చేశామని ఇప్పుడు గుడిసెకు రూ.15 వేల నుంచి రూ.20 వేల ఫెనాల్టీ విధించారని వారు వాపోతున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని లెనిన్నగర్, బీఆర్నగర్, డీకేనగర్, పాడిమల్లారెడ్డి నగర్ గుడిసె కాలనీల ఇళ్లకు వేల రూపాయల ఆస్తి పన్ను ఫెనాల్టీల రూపంలో వస్తుంది.
గ్రేటర్ పరిధిలో తప్పుడు సమాచారం పేరుతో వేసిన 25 రెట్ల ఫెనాల్టీలు సుమారు రూ. 20 కోట్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. చట్టం వచ్చిన కొత్తలో దీనిపై దృష్టి పెట్ట లేదు. అధికారులు కొన్ని నెలల క్రితం నగరంలో ప్రచారం పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సెల్ఫ్ అసెస్మెంట్లో కావాలని తప్పుడు సమాచారం ఇచ్చిన బడాబాబులను వదలకుండా పేదలు, గుడిసెవాసులకు మినహాయింపు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
గ్రేటర్ బడ్జెట్ సమావేశంలో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. పేదలు, గుడిసెవాసులను ఆస్తి పన్ను ఫెనాల్టీలను రద్దు చేయాలని సూచించారు. కౌన్సిల్లో తీర్మానం చేసి సీడీఎంఏకు పంపించాలని కోరడంతో పేదలు, గుడిసెవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశగా గ్రేటర్ పాలకవర్గం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.