స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 23 : శాంతి, సామరస్యంతోపాటు సుస్థిర ప్రభుత్వాలున్నచోటే అభివృద్ధి జరుగుతుందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం మండలంలోని శివునిపల్లి కేఆర్ గార్డెన్లో మండల ప్రత్యేకాధికారి, ఆర్డీవో వాసం రామ్మూర్తి అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్లను శ్రీహరి పంపిణీ చేశారు. ముందుగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. అనంతరం కడియం మాట్లాడుతూ దేశంలో మత విద్వేషాలు లేకుండా, శాంతి, సామరస్యం ఉన్నప్పుడే అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అన్ని మతాలను సమానంగా గౌరవించారని గుర్తు చేశారు.
బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా ఆయా మతాల ప్రజలకు సర్కారు కానుకలను పంపిణీ చేసిందన్నారు. ప్రతి నియోజకవర్గానికి సర్కారు వెయ్యి గిఫ్ట్ ప్యాక్లు కేటాయించగా, అత్యధిక క్రైస్తవులున్న స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గానికి మూడు వేల గిఫ్ట్ ప్యాకెట్లను అందిస్తున్నామని శ్రీహరి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులకు వీటిని అందించాలని ఆయన పాస్టర్లకు సూచించారు. క్రైస్తవుల్లో అనేక మంది మద్యానికి అలవాటుపడి ఆర్థికంగా నిలదొక్కులేకపోతున్నారని, దీని నివారణకు కృషి చేయాలని కోరారు. పిల్లలందరూ చదువుకునేలా సహకారం అందించాలన్నారు. కడియం ఫౌండేషన్ ద్వారా క్రైస్తవులకు తమవంతు సేవలందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖాగట్టయ్య, జఫర్గఢ్ జడ్పీటీసీ ఇల్లందుల బేబీశ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, తహసీల్దార్ డీ వెంకటేశ్వర్లు, ఇన్చార్జి ఎంపీడీవో శ్రీధర్స్వామి, ఆర్ఐ రవీందర్, ఎంపీటీసీలు బూర్ల లతాశంకర్, గుర్రం రాజు, గన్ను నర్సింహులు, రజాక్ యాదవ్, జఫర్గఢ్ సొసైటీ చైర్మన్ తీగల కరుణాకర్, క్రిస్మస్ వేడుకల ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు ఫాస్టర్ మారపాక బాలస్వామి, ఫాదర్ అగస్టీన్ రెడ్డి, ఫాదర్ దేవవరం, కే థామస్, నంగనూరి టెక్నో, కోర్నెల్, జయరాజు, తిమ్మోతి, నిర్మల్జ్యోతి బాబు తదితరులు పాల్గొన్నారు.