హనుమకొండ, ఫిబ్రవరి 29: నేటి చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు శుక్రవారం చలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో శ్రీహరి నివాసంలో గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ చలో మేడిగడ్డ కార్యక్రమం జనగామ, ఘన్పూర్, వరంగల్ బైపాస్, గూడెప్పాడ్, పరకాల, భూపాలపల్లి మీదుగా కొనుసాగుతుందన్నారు. దారిపొడవునా భద్రత ఏర్పాట్లు చేయాలని బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం పోలీస్ కమిషనర్ను కలిసి విజ్ఞప్తి చేసిందన్నారు. తెలిసీ తెలియక మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులకు కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేలా సజీవంగా చూపెడతామని పేర్కొన్నారు.
‘కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదు.. మూడు బరాజ్ల సమాహారం అని, 15 రిజర్వాయర్లు, 21 పంప్హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 240 టీఎంసీల వినియోగం.. వీటన్నింటి సమగ్ర స్వరూపమే ప్రాజెక్టు’ అని తెలిపారు. సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్మన్లు సుధీర్ కుమార్, గండ్ర జ్యోతి, నాగుర్ల వెంకన్న, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, నాయకుడు భరత్కుమార్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.