గీసుగొండ, సెస్టెంబర్ 5 : పేద ప్రజల కడుపులు నింపుతున్న సీఎం కేసీఆర్ సల్లగా ఉండాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని వంచనగిరి గ్రామంలో 118, శాయంపేటలో 64, మచ్చాపురంలో 119, హర్జ్యాతండాలో 7, ఊకల్లో 76, అనంతారంలో 37, విశ్వనాథపురంలో 76, కొమ్మాలలో 84, సూర్యతండాలో 20, నందనాయక్తండాలో 24, దస్రుతండాలో 16 మందికి ఆసరా పింఛన్ కార్డులను సోమవారం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమ పథకాలు వద్దనే చెప్పే మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీ తదతర కార్పొరేట్లకు లక్షల కోట్ల రుణం ఎందుకు మాఫీ చేసిందో చెప్పాలన్నారు. బీజేపీ నాటకాలను తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. టెక్స్టైల్ పార్కులో త్వరలోనే 11 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అర్హులైన లబ్ధిదారులకు దసరా తర్వాత ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.
నిధులు ఖర్చు చేయాలి..
మండలంలోని వంచనగిరి గ్రామపంచాయతీలో రూ. 60 లక్షల నిధులు ఉన్నా అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదని ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు. వారం రోజుల్లో పనులను పూర్తి చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భీమగాని సౌజన్య, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, ఎంపీడీవో రమేశ్, సర్పంచ్లు రాజబోయిన రజిత, మొగసాని నాగదేవత, బోడకుంట్ల ప్రకాశ్, అంగోత్ కవిత, మక్కెన అశ్విని, వీరాటి కవిత, వాంకుడోత్ రజిత, కేలోత్ సరోజన, బదావత్ అమ్మి, ఎంపీటీసీలు బేతినేని వీరరావు, గోపాల్, ఎంపీవో ప్రభాకర్, ఉప సర్పంచ్లు నాగయ్య, కొమురయ్య, మండలాధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు సముచిత స్థానం..
రాష్ట్రంలో మహిళలకు సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పించినట్లు ఎమ్మెల్యే చల్లా అన్నారు. కొమ్మాల, విశ్వనాథపురం గ్రామాల్లో సోమవారం రూ. 40 లక్షలతో నిర్మించే మహిళా భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గీసుగొండ యూనియన్ బ్యాంకు మేనేజర్ రణధీర్రెడిని సన్మానించారు. ప్రభుత్వం సంఘాలను ప్రోత్సహిస్తూ వడ్డీ లేని రుణాలను అందిస్తున్నదని ఆయన అన్నారు.
‘స్వచ్ఛ గురుకుల్’ ప్రారంభం..
మండలంలోని విశ్వనాథపురం గ్రామ శివారులోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, కళాశాలలో స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చల్లా ప్రారంభించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదవుతో పాటు తమ తరగతి గదులను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగేశ్వర్రావు, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.