పరకాలలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ, ప్రభం‘జనం’ సృష్టించింది. సీఎం కేసీఆర్ను చూసేందుకు, ఆయన ప్రసంగం వినేందుకు వేలాదిగా ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు జెండాలు, కండువాలతో తరలిరావడంతో సభా ప్రాంగణం గులాబీ వనాన్ని తలపించింది. వేదికపై ఏపూరి సోమన్న కళాబృందం తమ ఆటపాటలతో సభికులను ఉత్సాహపరిచింది. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా చప్పట్లు, ఈలలతో ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. కార్యక్రమం దిగ్విజయవంతం కావడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నిండింది.
పరకాల పట్టణంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ హోరెత్తింది. నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. నడికూడ, పరకాల, ఆత్మకూరు, గీసుగొండ, సంగెం, దామెర మండలాల నుంచి వేలాదిగా ప్రజలు, అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు దండులా తరలిరావడం కనిపించింది.
పరకాల పట్టణంలోని పలు వార్డుల నుంచి కౌన్సిలర్ల ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు డప్పు చప్పుళ్లు, ఊరేగింపులతో ర్యాలీగా సభకు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ రాక ముందు ఏపూరి సోమన్న కళా బృందం పాడిన పాటలతో సభకు వచ్చిన వారు ఉర్రూతలూగారు. సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో రాగానే సభకు హాజరైన వారు కేరింతలతో ఆయనకు స్వాగతం పలికారు. కేసీఆర్ ప్రసంగిస్తున్నంత సేపు ఆసక్తిగా విన్నారు.
రైతుబంధు కావాల్నా వద్దా అని అడిగినప్పడు సభికులు పెద్ద ఎత్తున ‘కావాలి’ అనడంతో ఇకపై 10వేలు కాదు, 16వేలు రైతుబంధు ద్వారా అందిస్తామని చెప్పడంతో పెద్ద ఎత్తున కేరింతలు, చప్పట్లతో మద్దతు తెలిపారు. చివరలో ముస్లింలను ఉద్దేశించి కేసీఆర్ ఉర్దూలో మాట్లాడడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. కాగా ప్రాంగణం సరిపోకపోవడంతో సభకు వచ్చిన చాలామంది రోడ్డుపైనే కిలోమీటరు మేర బారులు తీరి కనిపించారు.
పిల్లల నుంచి వృద్ధుల దాకా తరలివచ్చారు. సభ ముగిసిన అనంతరం కార్యకర్తలు వేదిక ఎదుట విజయోత్సాహంతో డ్యాన్స్ చేశారు. సీఎం కేసీఆర్కు వీడ్కోలు పలికి తిరిగి వస్తున్న ఎమ్మెల్యే చల్లాను ప్రజలు చుట్టుముట్టి అభినందనలు తెలిపారు. దగ్గరగా ఉండి తమ ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు. సభకు హాజరైన వారికి, విజయవంతం చేసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే చల్లా కృతజ్ఞతలు తెలిపారు.