మడికొండ, నవంబర్ 22: కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే తెలంగాణపై ఢిల్లీ పెత్తనం కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. గెలిచినంక ఆగం చేసే పార్టీలు మనకొద్దని, బీఆర్ఎస్ పార్టీతో భద్రత, భరోసా ఉంటుందని అన్నారు. గ్రేటర్ 44, 45వ డివిజన్ల పరిధిలో గల కడిపికొండ, అయోధ్యపురం, రాంపేట, కుమ్మరిగూడెం, ఇందిరమ్మ కాలనీ, భట్టుపల్లి, కొత్తపల్లి, అమ్మవారిపేట, జకులొద్ది, నకలపల్లి, లక్ష్మీపురం, అల్లీపురం, పెన్షన్పూర్, మామూనురు, తిమ్మాపురం గ్రామాల్లో ఆయన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణితో కలిసి ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ పార్టీ గెలిస్తే సీఎం అయ్యేదెవరో తెలియని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీలో చేతులు కట్టుకొని నిలబడటం తప్ప చేసేదేమీ ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీకి 11సార్లు అవకాశం ఇస్తే రాష్ర్టాన్ని ఆగం చేశారని, ప్రజలను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు.
ఆ పార్టీకి ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు వస్తాయని, యాభై ఏళ్లు వెనకి పోతామన్నారు. అందరం ఒకటై ఢిల్లీ గద్దెల నుంచి తెలంగాణను కాపాడుకుందామని తెలిపారు. ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్న కాంగ్రెస్ నాయకులు 50 ఏళ్లలో 11 సార్లు అవకాశం ఇస్తే ఏం వెలగబెట్టారని ప్రశ్నించారు. మళ్లీ అవకాశం ఇస్తే ఎరువుల కోసం దుకాణాల ముందు నిలబడాలా? కరెంటు కోసం అర్థరాత్రులు పొలాల కాడ పడుకోవాల్నా? ఇలాంటి దరిద్రపు పాలన మనకు మళ్లీ కావాలా? అని నిర్ణయించుకోవాలని కోరారు. వారెంటీ లేని కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ వంటి అనేక సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అందించినట్లు తెలిపారు. వ్యాగన్ పరిశ్రమల్లో భూములు కోల్పోయిన రైతులకు అండగా ఉంటామని, అధికారంలోకి రాగానే ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విలీన గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులు తీసుకోవచ్చి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. నియోజవర్గంలో పదేళ్లుగా ప్రజల సభ్యుడిగా ఉన్నానని పేర్కొన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఓటు వేయాలని సూచించారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందన్నారు.
డివిజన్ పరిధి గ్రామాల్లో ప్రచారం చేసేందుకు వచ్చిన అరూరికి స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. మహిళలు బతుకమ్మలు, బోనాలు, కోలాటం, మంగళ హారతులతో స్వాగతించారు. జిల్లా రైతుబంధు అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వర్రావు, ఈదురు అరుణ, విక్టర్, జిల్లా అధికార ప్రతినిధి ఉదయ్ కిరణ్, పాక్స్ చైర్మన్ ఊకంటి వనంరెడ్డి, మాజీ కార్పొరేటర్ బస్కె శ్రీలేఖ, బస్కె కృష్ణ, రమేశ్, జైపాల్రెడ్డి, స్పందన్, బొమ్మినేని రాంచంద్రారెడ్డి, గాదెం యాదగిరి, ఉల్లెంగుల శ్రీనివాస్ పాల్గొన్నారు.