అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ అని, ప్రపంచ దేశాలు రాష్ట్రం వైపు చూస్తున్నాయని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి స్పష్టం చేశారు. సోమవారం హసన్పర్తిలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రజినీకుమార్ అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను ఎనిమిదేళ్లలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ.. ప్రతి పేద ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. బీజేపీ స్వలాభం కోసం యువతను తప్పుదారి పట్టిస్తోందని, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు.
హసన్పర్తి, ఏప్రిల్ 10 : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను పట్టించుకున్న నాయకుడే లేడని, స్వరాష్ట్రంగా ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే తెలంగాణను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలబెట్టిన నాయకుడు సీఎం కేసీఆర్ అని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధు సూదనాచారి అన్నారు. హనుమకొండ జిల్లా హసన్పర్తిలో మం డలాధ్యక్షుడు బండి రజినీకుమార్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రపంచమే తెలంగాణ వైపు చూస్తున్నదని పేర్కొన్నారు.
తెలంగాణ కావాలని అడిగితే నక్సలైట్ అనే ముద్ర వేసే పరిస్థితులు ఉన్న సమయంలోనే జెండాపట్టి కొట్లాడి రాష్ట్రం సాధించిన ధీశాలి కేసీఆర్ అని అన్నారు. ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి పేద ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. దీన్ని చూసి ఓర్వలేని బీజేపీ నాయకులు మతాల మధ్య చిచ్చుపెట్టి యువతను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎర్రటెండల్లోనూ ప్రతి చెరువునూ నింపి రైతు కళ్లల్లో ఆనందం నింపిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై విషం చిమ్ముతున్నదని ఆరోపించారు. ఎంపీపీ సునీత, వైస్ ఎంపీపీ బండ రత్నాకర్రెడ్డి, జడ్పీటీసీ సునీత, పీఏసీఎస్ చైర్మన్లు బిల్లా ఉదయ్రెడ్డి, జక్కు రమేశ్గౌడ్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ అంచూరి విజయ్కుమార్, మాజీ జడ్పీటీసీ సుభాశ్గౌడ్, తిరుపతి పాల్గొన్నారు.
నిరుపేద కుటుంబాలకు మేనమామ కేసీఆర్
ఆడపిల్ల పెళ్లికి మేనమామలాగా కేసీఆర్ సారు కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.1,00,116 ఇచ్చిండు. ఈ డబ్బును పెండ్లికి ఖర్చు పెట్టిన. నాలాంటి పేద కుటుంబాలకు అండగా ఉంటున్న కేసీఆర్ సారుకు జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయనను మల్లా గెలిపించుకుంటాం.
-బైరి లక్ష్మి, కల్యాణలక్ష్మి లబ్ధిదారు, బైరాన్పల్లి