మహదేవపూర్ జూన్ 27: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అలీం కో సంస్థ ద్వారా అందిస్తున్న దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, ఇతర ఉపకరణాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ దివ్యాంగులు సమాజంలో అన్ని రంగాల్లో రాణించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగవు తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అన్ని విధాల కృషి చేస్తుందన్నారు. మండలంలో సుమారు 200 మంది దివ్యాంగులను గుర్తించడం జరిగిందని వారిలో మొదటి విడతలో 50 మంది దివ్యాంగులకు వివిధ రకాలైన బ్యాటరీ ట్రై సైకిళ్లు, సాధారణ ట్రై సైకిళ్లు, వినికిడి పరికరాలు, చేతి కర్రలు, స్టాండ్ లు వారి వారి వైకల్యాన్ని బట్టి అందిస్తున్నామని తెలిపారు.
అంతకు ముందు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 20 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన డా బి.ఆర్ అంబేద్కర్ చిల్డ్రన్ పార్క్ ను రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మెన్ అయిత ప్రకాష్ రెడ్డి, కూడా చైర్మెన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మి, సంక్షేమ అధికారి మల్లీశ్వరి, ఐసీడీఎస్ సీడీపిఓ రాధిక తదితరులు పాల్గొన్నారు.