తాడ్వాయి, ఫిబ్రవరి25: మేడారం సమ్మక్క, సారలమ్మల మహాజాతర విజయవంతంలో అధికారుల పనితీరు అభినందనీయమని పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు. జాతరలో విధులు నిర్వర్తించిన 20 శాఖల అధికారులకు మేడారంలోని అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో ఆదివారం చిరు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఐటీడీఏ పీవో అంకిత్, అదనపు కలెక్టర్లు శ్రీజ, వేణుగోపాల్, డీఎస్పీ రవీందర్ను శాలువా, మెమెంటోలతో సత్కరించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క, సారలమ్మల మహాజాతర విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఉద్యోగి పనితీరు ప్రశంసనీయమన్నారు. జాతరలో విధులు నిర్వర్తించేందుకు వచ్చిన ఇతర జిల్లాల అధికారులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అహర్నిశలు పనిచేసిన 20 శాఖల అధికారులు గత జాతరలోని తమ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూశారని అన్నారు.
ఈ జాతరలో అధికారులు తమ అనుభవాలను లేఖ రూపంలో అందించాలని, మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి సూచనలు, సలహాలు పాటిస్తామని అన్నారు. వచ్చే జాతర వరకు శాశ్వత సౌకర్యాలు కల్పిస్తామని, జాతర ముగిసినా భక్తుల రాక కొనసాగుతుందని, మేడారం పరిసరాల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా నిర్వహించాలని అన్నారు. అనంతరం జిల్లా అధికారులు సీతక్కను శాలువాతో సత్కరించారు.