న్యూఢిల్లీ, జూలై 27 : బంగారం మళ్లీ పరుగులు పెడుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతోపాటు దేశీయంగా పండుగ సీజన్ కూడా ప్రారంభంకాబోతుండటంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఫలితంగా న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1.50 లక్షలకు చేరువైంది. సోమవారం ఒకేరోజు రూ. 2,440 ఎగబాకి రూ.1,49,640కి చేరుకున్నది. అంతకుముందు గోల్డ్ ధర రూ. 1,47,200గా ఉన్నది. బంగారంతోపాటు వెండి దూసుకుపోయింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు అత్యధికంగా ఉండటంతో కిలో వెండి ఏకంగా రూ.5,300 ఎగబాకి రూ.2.30 లక్షలకు చేరుకున్నట్టు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
గతవారంతంలో వెండి రూ.2,24,700గా ఉన్నది. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన అత్యంత విలువైన లోహాలు తిరిగి పుంజుకున్నాయని, క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గే అవకాశం ఉండటంతో మదుపర్లలో సెంటిమెంట్ను మెరుగుపరిచిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడం కూడా ధరలు పుంజుకోవడానికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. వీటికి తోడు రూపాయి బలోపేతం కావడం కూడా కలిసొచ్చిందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 42.13 డాలర్లు లేదా 1.04 శాతం ఎగబాకి 4,095.30 డాలర్లకు చేరుకోగా, వెండి 1.47 శాతం అందుకొని 59.04 డాలర్లకు చేరుకున్నది.