ములుగురూరల్ : 2026లో జరగనున్న శ్రీ మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను విజయవంతం చేసేందుకు ముందస్తు ప్రణాళికతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ది పనులను చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి అధికారులతో మేడారం జాతర, వానకాలంలో చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఇప్పటికే రూ.33కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, మరో 100కోట్లను ప్రభుత్వం కేటాయిస్తుందని తెలిపారు.
గద్దెల ప్రాంతంలో భక్తులు ఇబ్బందులు పడకుండా క్యూలైన్ల నిర్మాణం చేపట్టాలని అన్నారు. భక్తుల రక్షణార్థం పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న వానకాలంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సీజన్ల వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ దావాఖానల్లో 3 నెలలకు సరిపడా మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
గ్రామాల్లో పారిశుద్ద్య నిర్వహణను సక్రమంగా చేపడుతూ అధికార యంత్రాంగం సమిష్టిగా పనిచేసి ప్రజలకు భరోసాను అందించాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర, ఎస్పీ డాక్టర్ పి. శబరీశ్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, ఆర్డీవో వెంకటేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.