మహబూబాబాద్/ మహబూబాబాద్ రూరల్/కురవి, జనవరి 19 : సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిందే కంటి వెలుగు కార్యక్రమమని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. గురువారం పట్టణంలోని గుమ్ముడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్నాయక్తో కలిసి, కురవి మండలం బలపాల పీహెచ్సీ పరిధిలోని తాట్యాతండా స్కూల్ ఆవరణలో మంత్రి రెండో విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. కంటివెలుగు కార్యక్రమం తెలంగాణలో తప్ప ప్రపంచంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నిరుపేదల కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. జిల్లాలో 461 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీల్లోని 82 వార్డుల్లో 38 మంది టీమ్లు వందరోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అన్నారు. జిల్లాలో 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వైద్యులు ఓపికగా కంటి పరీక్షలు చేయాలని సూచించారు. శిబిరంలో రోజుకు 300 మందికి కంటి పరీక్షలు చేస్తారని అన్నారు. దగ్గరి చూపు సమస్య ఉన్న వారికి వెంటనే, దూరం చూపు సమస్య ఉన్న వారికి రీడింగ్ నమోదు చేసి వారం పదిరోజుల్లో కళ్లద్దాలు అందిస్తారని చెప్పారు.
‘సర్వేంద్రియానం నయనం ప్రధానం’ అన్నట్లుగా కళ్లు లేకపోతే జగమంతా చీకటి మయమవుతుందని, మనిషి దేహంలో అత్యంత విలువైన కళ్లను పరిరక్షించుకోవాలన్నారు. పూర్వం గిరిజనులు జొన్నరొట్టెలు, గడక వంటి పోషకాలతో కూడిన ఆహారం తీసుకునేవారని, ఇప్పటికీ తండాల్లో 80 ఏళ్ల వృద్ధులకు కూడా కళ్లద్దాలు లేవన్నారు. కానీ, మారుతున్న కాలంలో వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికీ కళ్లద్దాలు వస్తున్నాయన్నారు. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. కంటి పరీక్షలపై ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి కంటి పరీక్షలు చేయించుకునే విధంగా సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం కంటి పరీక్షలు మాత్రమే కాకుండా, అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు, మందులు అందజేస్తున్నదన్నారు. గత పాలకులకు ఏనాడూ ఇంతమంచి ఆలోచన రాలేదని, సీఎం కేసీఆర్ పేదల కోసం ఆలోచించే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. జడ్పీ చైర్పర్సన్ బిందు మాట్లాడుతూ.. రాష్ట్ర సర్కార్ కంటి వెలుగుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని, అధికారులు సమన్వయంతో ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి, కంటి పరీక్షలు చేయించాలన్నారు.
ఎమ్మెల్యే శంకర్నాయక్ మాట్లాడుతూ.. ప్రతి మనిషికి కళ్లే ప్రపంచమని, చూపు కోల్పోతే పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కల్పించిన ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రెండో విడుత చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని 100శాతం విజయవంతం చేస్తామన్నారు. జిల్లాలో 38 మంది బృందాలతో వంద రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. శిబిరాల్లో ప్రతి రోజూ ఉదయం 9 గంటలకే ఈ కార్యక్రమం ప్రారంభిస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డును తీసుకొచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.కురవి మండలం తాట్యాతండాలో డీఎంహెచ్వో హరీశ్రాజ్ జిల్లాలో 21 పీహెచ్సీలు, 173 సబ్సెంటర్లు ఉన్నాయని, పీహెచ్సీతో పాటు సబ్సెంటర్లలో కూడా వైద్యులు ఉన్నారన్నారు. 2018 కంటివెలుగు కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా 56శా తం అంటే 5.20లక్షల మందికి మాత్రమే సేవలందించామన్నారు. అప్పుడు 19టీంలు పనిచేశాయని, ఇప్పుడు 38 టీంలు పనిచేస్తున్నాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో 6.18లక్షల మంది ఉన్నారని, రోజుకు 300 మందికి పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు.
కురవి జడ్పీటీసీ విరాళం
కురవి జడ్పీటీసీ బండి వెంకట్రెడ్డి కురవి మండలంలో కంటి శిబిరాలకు వచ్చే వృద్ధులు, మహిళలను దృష్టిలో ఉంచుకుని వారికి తాగునీరు, బిస్కెట్స్ అందించడం కోసం ఉమ్మడి కురవి మండలంలోని 48 గ్రామపంచాయతీలకు గాను 1000 రూపాయల చొప్పున మంత్రి సమక్షంలో ఎంపీడీవో సరస్వతికి అందజేశారు. ప్రతి గ్రామపంచాయతీకి వెయ్యి రూపాయల చొప్పున అందించిన జడ్పీటీసీని మంత్రి అభినందించారు. మహబూబాబాద్లో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి,అదనపు కలెక్టర్ అభిలాషాఅభినవ్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్నారాణి, కంటి వెలుగు నోడల్ అధికారి శ్రీనివాస్, వార్డు మెంబర్లు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కురవిలో జడ్పీటీసీ బండి వెంకట్రెడ్డి, సర్పంచ్లు రమేశ్, జీవన్, హరిప్రసాద్, జిల్లా నాయకులు కొంపెల్లి శ్రీనివాస్రెడ్డి, శ్రీరాం, కిషన్నాయక్, డిప్యూటీ డీఎంహెచ్వోలు అంబరీష్, ఉమాగౌరి, రాష్ట్ర ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్, డీడబ్ల్యూవో నర్మద, సీడీపీవో ఎల్లమ్మ, ఎన్హెచ్ఎం డీడీఎం రుక్మొద్దీన్, జిల్లా క్షయ కోఆర్డినేటర్ రవీందర్, హెల్త్ ఎడ్యుకేటర్ రాజు, పురుషోత్తం, కంటివెలుగు వైద్యాధికారి అశోక్కుమార్, ఆప్తమాలజిస్టు పూర్ణచందర్రావు పాల్గొన్నారు.
రైతుల సమస్యలు పరిష్కరించాలి
కురవి మండలం తాట్యాతండా చుట్టుపక్కల రైతులు తమకు భూమి ఉన్నా పట్టాలు కావడంలేదని, రైతుబంధు డబ్బులు పడడం లేదని మంత్రి సత్యవతి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఆ మె కలెక్టర్ శశాంకతో ఫోన్లో మాట్లాడారు. గుండ్రాతిమడుగు పరిధిలోని సర్వే నంబర్ 591, అనంతారం పరిధిలోని 281 సర్వేలో ఉమ్మడి గుండ్రాతిమడుగు(విలేజ్) రైతులు భూమి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారని, ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి పట్టాలు ఇచ్చి, రైతుబంధుకు అర్హులయ్యేలా చూడాలని సూచించారు. అదేవిధంగా ఎస్సారెస్పీ కెనాల్ నీళ్లు రైల్వే లైన్ ఉండడం వల్ల తాట్యాతండాకు, కొత్తూరు(జీ) వరకు రావడంలేదని రైతులు తెలపడంతో ఎస్సారెస్పీ డీఈతో మాట్లాడారు. శుక్రవారం వచ్చి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించారు.