భద్రాచలం, జూలై 29: భద్రాద్రి రాముడి అపర భక్తురాలైన దమ్మక్క శోభాయాత్రను భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఏటా గురుపౌర్ణమి రోజున సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా తొలుత రామాలయంలో మూలవరుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు ఆలయం వెలుపల పొగడ చెట్టు వద్ద దమ్మక్క విగ్రహానికి ఆలయ ప్రధాన అర్చకులు విజయరాఘవన్ ఆధ్వర్యంలో హారతి ఇచ్చారు. మెట్ల సమీపంలో ఉన్న వ్యాస మహర్షి విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు.
అనంతరం రామాలయం నుంచి స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రచార రథంపై పట్టణ వీధుల్లో శోభాయాత్ర చేపట్టారు. గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలతో యాత్ర సాగింది. మార్గమధ్యలో తూము నరసింహదాసు, భక్తరామదాసు విగ్రహాల వద్ద హారతి సమర్పించారు. సబ్ కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఉన్న దమ్మక్క విగ్రహం వద్ద ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సర్పంచ్ పూనెం కృష్ణ, దేవస్థానం ఈవో దామోదర్రావు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. తర్వాత గిరిజనులు అడవి నుంచి సేకరించి తెచ్చిన పూలు, పండ్లను భక్తిశ్రద్ధలతో భద్రాద్రి రామయ్యకు సమర్పించారు. ఆ పుష్పాలతో విశేష పుష్పార్చన సేవను వైదిక బృందం నిర్వహించింది. భక్తుల సమక్షంలో స్వామివారి కల్యాణం నేత్రపర్వంగా సాగింది.