రేవంత్రెడ్డి.. ఓ చిల్లర దొంగ అని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. బుధవారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి గీసుగొండ మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రైతులకు పంట నష్ట పరిహారం చెక్కులను అందజేశారు. అనంతరం ఎలుకుర్తి, మచ్చాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీని సుమారు 50ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తే ఇకపై ఊరుకోమని హెచ్చరించారు. అంబానీ, అదానీల కోసమే ప్రధాని మోదీ పని చేస్తున్నాడని, పేదల బాగోగులు ఆయనకు పట్టవని విమర్శించారు. గిరిజన రిజర్వేషన్ను 10 శాతం పెంచాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొక్కిపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్లలోనే రాష్ట్రాన్ని ఊహించని రీతిలో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ వైపు యావత్తు దేశం చూస్తున్నదన్నారు.
గీసుగొండ, సెప్టెంబర్ 13 : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఓ చిల్లర దొంగ అని, ఆయన చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని మంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో రూ. 34 కోట్ల 25 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నందనాయక్తండాలో రూ. 2 కోట్లతో నిర్మించే బంజారా భవనానికి, నందనాయక్తండా నుంచి రంగాపురానికి రూ. 2 కోట్ల 40 లక్షలతో నిర్మించే రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. హర్జ్యాతండాలో రూ. 20 లక్షలతో నిర్మించిన జీపీ భవనాన్ని ప్రారంభించి, హర్జ్యతండా నుంచి మంగళ్తండా వరకు రూ. 2 కోట్ల 40 లక్షలతో నిర్మిస్తున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. మచ్చాపురంలో రూ. 20 లక్షలతో నిర్మించిన జీపీ భవనం, మచ్చాపురం నుంచి లక్ష్మీపురం దాకా రూ. 18 కోట్ల 80 లక్షలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. గ్రామంలో రూ. 40 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.
అనంతరం రైతులకు పంట నష్ట పరిహారం చెక్కులను అందజేశారు. ఎలుకుర్తిలో రూ. 20 లక్షలతో నిర్మించిన జీపీ భవనం, రూ.60 లక్షలతో నిర్మించిన మహిళా భవనాన్ని ప్రారంభించి, రైతులకు పంట నష్ట పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఆరెపల్లి గ్రామంలో రూ.7 కోట్ల 5 లక్షలతో నిర్మించే రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఎలుకుర్తి, మచ్చాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కోసం పని చేస్తున్నదని విమర్శించారు. దేశంలో పేదల వద్ద నుంచి ట్యాక్సుల రూపంలో వసూళ్లు చేస్తున్న సోమ్మును మోదీ అంబానీ, అదానీలకు పంచుతున్నాడని, ప్రజలు ఆ పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్ను 10 శాతం పెంచాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపితే ఇంతవరకు ఆమోదించకుండా తొక్కిపెట్టిందన్నారు. దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కోరారు.
50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు. ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు బుద్ధి లేదని, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలో ఉందని అక్కడ కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 4 వేల కోట్లతో గిరిజనతండాలకు రోడ్లు మంజూరు చేశామన్నారు. రేవంత్రెడ్డికి వ్యవసాయంపై అవగాహన లేదన్నారు. దేశం మొత్తం సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నదన్నారు. మన కండ్ల ముందు పని చేస్తున్న నాయకులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. సీఎం కేసీఆర్ సంపదను సృష్టిస్తూ పేదలకు పంచుతున్నారని ఆలాంటి నాయకుడు పది కాలాలపాటు ఉండాలన్నారు. జీపీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులకు గర్తించామన్నారు. అంగన్వాడీలను బలోపేత్తం చేయడంతో పాటు వేతనాలు పెంచామన్నారు. సర్వీసులో ఉన్న అంగన్వాడీలు, హెల్పర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 2 లక్షల బీమా సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తున్నదన్నారు. దివ్యాంగులకు పింఛన్ రూ.4 వేలు ఇస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ప్రాణం ఉన్నంత వరకు రైతు బంధు ఆగదన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో 12,769 గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. కాలేశ్వరం ప్రాజక్టు ద్వారా రైతులకు సాగు నీరు అందుతోందన్నారు.
తెలంగాణలో చిల్లర రాజకీయాలు సాగవు..
– ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు సాగవని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆనాడు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన నాయకులు గ్రామాల్లో గొడవలు సృష్టించింది ప్రజలు మర్చిపోలేదన్నారు. మీ చిల్లర గొడవలకు భయపడే వాడిని కాదన్నారు. పచ్చగా ఉన్న గ్రామాల్లో గొడవలు సృష్టించేందుకు వస్తున్న కాంగ్రెస్ నాయకులను తరమికొట్టాలని ప్రజలను కోరారు. కోనాయిమాకుల లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టుతో 1400 ఎకరాలకు సాగునీరు అందించబోతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, ఎంపీపీ భీమగాని సౌజన్య, తహసీల్దార్ రియాజుద్దీన్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ బాలునాయక్, సర్పంచ్లు నాగేశ్వర్రావు, అమ్మి, రజిత, సరోజన, వీ కవిత, ఏ కవిత, ప్రకాశ్, జైపాల్రెడ్డి, ఎంపీటీసీ రజిత, డీఈ సుధాకర్, ఎంపీడీవో వీరేశం, రైతు బంధు సమితి మండల కన్వీనర్ వీరాటి లింగారెడ్డి, మండలాధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్, కార్యదర్శి వేణుగోపాల్రెడ్డి, సొసైటీ చైర్మన్లు మోహన్రెడ్డి, వీరస్వామి, రడం శ్రీధర్, నాయకులు గుగులోత్ రాజు, మహబూబ్నాయక్, నర్సింహ, రవీందర్రెడ్డి, నాగయ్య, రాజశ్వర్రావు, ఐసీడీఎస్ అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.