హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలో ఆగస్టులో కూడా లోటు వర్షపాతం కొనసాగుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. 12జిల్లాల్లో -21 నుంచి -45 వరకు లోటు వర్షపాతం నమోదవుతున్నది. ఆగస్టులో సాధారణ సగటు వర్షపాతం 215.8 మి.మీగా ఉంది. బుధవారం నాటికి 87.6 మి.మీ వర్షపాతం కురువాల్సి ఉండగా, కేవలం 71.2 మి.మీ నమోదైంది. దీంతో ఈనెలలో 19 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్లో జూన్ 1 నుంచి బుధవారం వరకు -30 శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
గత 24 గంటల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేటలో అత్యధికంగా 8.39 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం కారణంగా ఈనెల 18 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించారు. గురువారం భద్రాద్రి -కొత్తగూడెం, హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మేడ్చల్-మల్కాజిగిరి, మహబూబాబాద్, మహబూబ్నగర్, మెదక్, నాగర్కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి వర్షం కురిసే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేశారు.