ములుగురూరల్, నవంబర్21 : కష్టాలు తెలిసిన నాగజ్యోతిని గెలిపించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. మంగళవారం రాత్రి మల్లంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రచార ఆర్భాటాలు, సోషల్ మీడియా తప్ప కాంగ్రెస్ పేదలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సీతక్కను ప్రజలు చిత్తు చిత్తు ఓడించి నాగజ్యోతిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాగజ్యోతి తల్లిదండ్రులు పేదల కష్టాలు తీర్చడం కోసం జీవితాలను అంకితం చేసి కనుమూస్తే ప్రజల సంక్షేమం కోసం నాగజ్యోతి సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చిందన్నారు. మాయ మాటలు చెప్పే కాంగ్రెస్ను ప్రజలు నమ్మవద్దన్నారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రూ.600 పింఛన్ ఇస్తూ ఇక్కడికి వచ్చి రూ.4 వేలు ఇస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. కరెంట్ వద్దనే కాంగ్రెస్ కావాలా..? 24గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. ధరణిని తీసేయమనే కాంగ్రెస్ను గోదావరిలో పాతిపెట్టాలన్నారు. సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే మల్లంపల్లిని మండలంగా ప్రకటించిన విషయం గుర్తు చేశారు. వచ్చే సంవత్సరం వరకు మల్లంపల్లికి తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్ కార్యాలయాలు వస్తాయని దీంతో మండల రూపు రేఖలు మారుతాయన్నారు. దీనికి మల్లంపల్లి ప్రజలు బడే నాగజ్యోతి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నాగజ్యోతిని గెలిపించుకుంటే సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోవడంతో పాటు దివంగత జడ్పీచైర్మన్ కుసుమ జగదీశ్ ఆశ నెరవేరుతుందన్నారు. ములుగు గడ్డపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. రాష్ట్రం మొత్తం ములుగు వైపు చూస్తుందన్నారు.
దివంగత జడ్పీ చైర్మన్, మల్లంపల్లి ముద్దుబిడ్డ కుసుమ జగదీశ్వర్ అకాల మరణం పార్టీకి, జిల్లా ప్రజలకు తీరని లోటని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. జగదీశ్వర్ సామాన్య జీవితం గడిపేవాడని, పార్టీ ఏ పిలుపు ఇచ్చినా చురుకైన పాత్ర పోషించేవాడని తెలిపారు. జగదీశ్వర్ కోరిక మేరకు మల్లంపల్లి గ్రామాన్ని సీఎం కేసీఆర్ మండలంగా ప్రకటించారన్నారు. జగదీశ్వర్ మరో కోరిక ములుగు గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలన్నారు.బడే నాగజ్యోతికి అధిక మెజార్టీని అందించాలని విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో తాను మొదటి సారిగా ములుగు గడ్డపై ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటిసారిగా పోటీ చేస్తున్నానని బడే నాగజ్యోతి అన్నారు. ఎమ్మెల్యే సీతక్క రెండు పర్యాయాలు గెలిచి చేసిందేమీ లేదన్నారు. తాను ఈ ప్రాంత సమస్యలు తెలిసిన బిడ్డగా తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు. 60ఏళ్లు కాంగ్రెస్కు ఓటు వేసి గోస పడ్డామని, కేసీఆర్ వచ్చినంక అభివృద్ధి అంటే ఏంటో చూశామని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ వస్తే అరిగోస పడుతామని హెచ్చరించారు. మన ప్రాంతానికి అన్ని కావాలన్నా, సస్యశ్యామలంగా ఉండాలన్నా బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.
రైతుల గురించి ఆలోచించే నాయకుడు, అందరి కోసం కొట్లాడే నాయకుడు కేసీఆర్ వెంట ప్రజలు ఉండాలని సూచించారు. మల్లంపల్లి ప్రజలు ఆదరించాలని కోరారు. ఎన్నికల్లో తనకు ఓటు వేసి ఆశీర్వదించాలన్నారు. జదీశ్వర్ సతీమని రమాదేవి మాట్లాడుతూ తన భర్త చనిపోయే ముందు రోజు నాగజ్యోతికి టికెట్ వస్తుందని, ఎన్నికల్లో తనతో పాటుగా పనిచేయాల్సిన అవసరం ఉందని తనకు చెప్పాడని గుర్తు చేశారు. నాగజ్యోతిని గెలిపించుకొని మల్లంపల్లి ప్రజలు రుణం తీర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్కో రాష్ట్ర చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి, సర్పంచ్ చంద కుమారస్వామి, ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.