ఇక్కడి ప్రజల ఉత్సాహం చూస్తుంటే పూర్వ వరంగల్ మొత్తం గులాబీ జెండానే రెపరెపలాడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అధ్యక్షతన వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఆజంజాహీ మిల్స్ గ్రౌండ్లో శనివారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగసభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. వరంగల్లో రూ.1,116 కోట్లతో నిర్మిస్తున్న అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను దసరా నాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నామని చెప్పారు. రూ.80కోట్లతో అధునాతన కలెక్టరేట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని, ఏడాదిలోపు పూర్తిచేసి అందిస్తామని వెల్లడించారు. ఒక్కరోజే వరంగల్లో మొత్తం రూ.618 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నామని, 60ఏళ్లలో లేని అభివృద్ధిని 9ఏళ్లలో పూర్తిచేసుకున్నాం కాబట్టే నేడు దశాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యే నరేందర్ బాగా పనిచేస్తున్నారని అభినందించారు. ‘ముఖ్యమంత్రి ఆశీర్వాదం, మీ దయ ఉంటే మళ్లీ తప్పకుండా మంచి మెజారిటీతో బ్రహ్మాండంగా గెలిచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’నని చెప్పారు.
– వరంగల్, జూన్ 17 (నమస్తే తెలంగాణ)
వరంగల్, జూన్ 17(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి వరంగల్లో ఎగిరేది గులాబీ జెండానేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఆజంజాహీ మిల్స్ గ్రౌండ్లో శనివారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్నారని కాంగ్రెస్, బీజేపీ నాయకులు అంటున్నారని, సాధించినం కాబట్టే ఉత్సవాలు జరుపుకొంటున్నామని స్పష్టం చేశారు. 60ఏళ్లలో లేని అభివృద్ధిని 9ఏళ్లలో సాధించామని, వరంగల్లో ఒక్కరోజునే రూ.618కోట్లతో పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసుకున్నామని చెప్పారు. వరంగల్లో రూ.1,116 కోట్లతో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ దవాఖానను దసరా నాటికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నామని ప్రకటించారు.
వరంగల్ నగరం, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని సీఎం కేసీఆర్ వరంగల్లో అతిపెద్ద హాస్పిటల్ నిర్మించాలని సంకల్పించి ఆ మేరకు కడుతున్నారని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద దవాఖానను వరంగల్లో నిర్మించుకుంటున్నామని, హైదరాబాద్లో కూడా రెండు వేల పడకలతో కూడిన ఇంతపెద్ద హాస్పిటల్ లేదని చెప్పారు. ఈ హాస్పిటల్ ప్రారంభంతో పేదలకు అనేక రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కోరిక మేరకు రూ. 80 కోట్లతో అధునాతన కలెక్టరేట్ నిర్మాణానికి ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నామని, ఏడాదిలోపు పూర్తిచేసి అందిస్తామని వెల్లడించారు. రూ. 313కోట్లతో వరంగల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకు కూడా శంకుస్థాపన చేసుకున్నామని, 6 నుంచి 9 నెలల వ్యవధిలో పనులను పూర్తి చేస్తామని చెప్పారు. ఇక్కడ రూ.77.5కోట్లతో మూడున్నర ఎకరాల్లో మోడల్ బస్టాండ్ను నిర్మించుకోబోతున్నామన్నారు.
రూ.20కోట్లతో ఎస్టీపీని ప్రారంభించుకున్నామని చెప్పారు. నగరం విస్తరిస్తున్నందున ప్రజల అవసరాల కోసం రూ.50కోట్లతో తాగునీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు వరంగల్పై ఎంతో ప్రేమ ఉందని, అందుకే ఇక్కడ ఎక్కువ మందికి పదవులు ఇచ్చారని చెప్పారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని ప్రశంసించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు భూమిపూజ, శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు విజయవంతం కావడం, సభ సక్సెస్ కావడంపై ఎమ్మెల్యే నరేందర్ను అభినందించారు. ‘నరేందర్ బాగా పనిచేస్తున్నారు.. ముఖ్యమంత్రి ఆశీర్వాదం, మీ దయ ఉంటే మళ్లీ తప్పకుండా మంచి మెజారిటీతో బ్రహ్మాండంగా గెలిచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’నని చెప్పారు. మామునూరు ఏయిర్పోర్టును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే ఇవ్వడం లేదన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి కూడా ఇవ్వలేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.
ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. ట్రైబల్ యూనివర్సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం ములుగులో 350 ఎకరాలు కేటాయించి ఏళ్లు గడిచిపోతోందని తూర్పారబట్టారు. సభలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, వరంగల్, మహబూబూబాద్ ఎంపీలు దయాకర్, కవిత, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్నాయక్, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రోడ్ల అభివృద్ధి చైర్మన్ మెట్టు శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ ఎం రవీందర్రావు, బీఆర్ఎస్ నేతలు బొల్లం సంపత్కుమార్, సీతారాంనాయక్, ఎస్ సమ్మారావు, పుల్లా పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.
సభ సూపర్ సక్సెస్
వరంగల్ చౌరస్తా : వరంగల్ ఐడీఓసీ గ్రౌండ్ (ఆజంజాహీ మిల్స్ స్థలం)లో శనివారం సాయంత్రం నిర్వహించిన మంత్రి కేటీఆర్ సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేశారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ నినాదాలతో హోరెత్తించారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని అన్ని కూడళ్లలో గులాజీ జెండాలు రెపరెపలాడాయి. ఎటువైపు చూసినా నగరం పూర్తిగా గులాబీమయమైంది. తూర్పు నియోజకవర్గ పరిధిలో సుమారు రూ.618 కోట్లతో పనులు చేపట్టడం, సభ సక్సెస్ కావడంపై నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నిండింది. సభా వేదికపై గాయని మధుప్రియ బృందం పాడిన పాటలకు సభాప్రాంగణంలో కార్యకర్తలు, మహిళలు నృత్యాలు చేశారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి కార్యకర్తలు, అభిమానులు డీజే, డప్పు చప్పుళ్లతో నృత్యం చేస్తూ సభకు తరలివచ్చారు. కాశీబుగ్గ నుంచి లంబాడా సంప్రదాయ వేషధారణలో వచ్చిన యువతుల నృత్యాలు అలరించాయి. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతమయ్యేలా కృషి చేశారు.