వరంగల్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుతం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పెద్దలు చెప్పినట్లు స్వచ్ఛమైన నీరు, గాలి, పరిసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించే క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్, ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ బి శ్రీనివాసరావుతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు టి నారాయణరావు అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. మిషన్ భగీరథ రూపంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛమైన నీరు అందిస్తున్నదని, ఇంటింటికీ నల్లాల ద్వారా గోదావరి, కృష్ణా జలాలను సరఫరా చేస్తున్నదని ఆయన తెలిపారు. స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి హరితహారం ద్వారా ఊరూ రా దాదాపు 240 కోట్ల మొక్కలు నాటినట్లు చెప్పారు. కా ల్వల్లో, చెరువుల్లో, వాగుల్లో, చెక్డ్యాముల్లో, ఎక్కడా చూ సిన నీరు ఉండేలా ప్రభుత్వం నీటి వనరులను అభివృద్ధి చేసిందన్నారు. ఇవాళ కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కాదు.. కే అంటే కాల్వలు, సీ అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అని రైతులు చెబుతున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం రాష్ర్టాన్ని జలమయం చేశారని ఆయన పేర్కొన్నారు.
పుట్టినగడ్డ రుణం తీర్చుకునేందుకు సొంతూరు ఏనుగల్లులో ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు, డాక్టర్ హరిణి, ప్రతీక్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్, వారి కుటుంబ సభ్యులందరూ ముందుకొచ్చి గ్రామంలో మూడు రోజుల పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి అభినందించారు. వారం రోజుల నుంచి వారంతా ఇక్కడే ఉండి ఈ గ్రామం, పరిసరాల్లోని తండాల గిరిజన మహిళలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించేందుకు ఏర్పాట్లు చేశారని, స్క్రీనింగ్ తర్వాత వైద్యం కూడా తమ క్యాన్సర్ హాస్పిటల్లో ఉచితంగా వైద్య చేయిస్తామని చెప్పిన ప్రతిమ ఫౌండేషన్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. తన ఊరి ప్రజల కోసం సొంత జిల్లాలో క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలంటే గుండెలో ప్రేమ ఉండాలని.. పుట్టిన గడ్డపై మమకారం ఉన్నందునే ఈరోజు ప్రతిమ ఫౌండేషన్ బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నదని కొనియాడారు.
మంత్రి కేటీఆర్ ఏనుగల్లుకు వరాలు ప్రకటించారు. స్థా నికుల కోరిక 30 పడుకల హాస్పిటల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిమ ఫౌం డేషన్ భవనం నిర్మించి ఇస్తే ప్రభుత్వం స్కిల్ సెంటర్ నిర్వహిస్తుందని తెలిపారు. గిరిజన ఆడబిడ్డల కోసం ట్రైబల్ వె ల్ఫేర్ రెసిడెన్సియల్ పాఠశాలను నెలకొల్పనున్నట్లు చెప్పా రు. ఎత్తు ప్రదేశంలో ఉన్న గడ్డపారతండాకు నీరందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మంజూరు చేస్తామని తెలిపారు. తమ గ్రామానికి వరాలు ప్రకటించడంతో సంబురపడ్డ ప్ర జలు.. తమకు ఇది మరిచిపోలేని రోజని సంతోషం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఏనుగల్, పరిసర గ్రామాల ప్రజల కోసం అత్యవసర వైద్యం కోసం వరంగల్కు వెళ్లేందుకు ఒ క అంబులెన్స్, ప్రజల అవసరాల కోసం వాటర్ ప్లాంట్ను కేటాయించినట్లు ప్రతిమ ఫౌండేషన్ తెలిపింది. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, ప్రతిమ ఫౌండేషన్ డైరెక్టర్లు డాక్టర్ బి హరిణి, డాక్టర్ ప్రతీక్ తదితరులు సభలో ప్రసంగించా రు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, చీఫ్వి ప్ వినయ్భాస్కర్, ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యేలు పెద్ది సు దర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ లు టీ రవీందర్రావు, బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, కుడా చైర్మన్ సుందర్రాజు, డీసీసీబీ చైర్మన్ ఎం రవీందర్రావు, జడ్పీటీసీ సింగూలాల్, సర్పంచ్ సంధ్య, బీఆర్ఎస్ నేతలు ఎస్ సమ్మారావు, సీతరాంనాయక్, కేశవరా వు, ఎం శోభన్, ఇండ్ల నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
అమ్మాయిలు చదువుకుంటే దేశం అన్ని రంగా ల్లో ప్రగతి సాధిస్తుంది. అబ్బాయి చదువుకుంటే కేవలం తన వ్యక్తిగతంగా మాత్రమే అభివృద్ధి సాధిస్తారు. కానీ అమ్మాయి చదువుకుంటే కుటుంబంతోపాటు రానున్న తరాలు కూడా అభివృద్ధి సాధిస్తాయి. దేశం కూడా పురోగమిస్తుంది. సమాజంలో 50శాతం ఉన్న మహిళల్లో కేవలం 18శాతం మం ది మాత్రమే ఎంచుకున్న రంగాల్లో రాణిస్తున్నారు. అమ్మాయిలను అబ్బాయిలకు తీసిపోకుండా చదివించాలి. గ్రామాల్లో ఇప్పటికీ అమ్మాయిలపై చిన్నచూపు ఉండడం బాధాకరం. రానున్న రోజుల్లో ప్రతిమ గ్రూపు సంస్థ ఆధ్వర్యంలో ఏనుగల్లులో సేవా కార్యక్రమాలు చేపడుతాం.
– ప్రతిమ ఫౌండేషన్ నిర్వాహకురాలు డాక్టర్ హరిణి
క్యాన్సర్, గుండెజబ్బులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సీఎం కేసీఆర్ మహిళల ఆరోగ్యాల పరిరక్షణకు ప్రతి మంగళవారం కేవలం మహిళలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలందించాలని నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది అన్ని ఆరోగ్య సమస్యలపై కూడా పరీక్షలు చేసేందుకు మంత్రి హరీశ్రావు కరీంనగర్లో ప్రారంభించారు. అలాగే పల్లె, పట్టణ దవాఖానాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రజలకు వైద్య సేవలు అందిస్తోంది. ప్రభుత్వం వైద్యం, విద్యా రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగాపని చేస్తోంది. ప్రజల కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలి.
– వరంగల్ జడ్పీచైర్పర్సన్ గండ్ర జ్యోతి