తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అంత్యక్రియలు సోమవారం ములుగు మండలం మల్లంపల్లిలో అశేష జనావళి కన్నీటి నడుమ ముగిశాయి. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరై జగదీశ్ పార్థివ దేహంపై పూలమాలవేసి, పార్టీ జెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు. జగదీశ్ కుటుంబసభ్యులను ఓదార్చి, అండగా ఉంటామని భరోసానిచ్చారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివచ్చి జగదీశ్కు కడసారి వీడ్కోలు పలికారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి దగ్గరుండి చేయించారు. అంతిమయాత్రలో పాడెను మోస్తూ మంత్రి సత్యవతి, ఎమ్మెల్సీ పల్లా ముందుకు కదిలారు.
– ములుగు, జూన్12 (నమస్తేతెలంగాణ) ములుగురూరల్
ములుగు, జూన్12(నమస్తేతెలంగాణ)/ములుగురూరల్ : ములుగు జడ్పీ అధ్యక్షుడు కుసుమ జగదీశ్వర్ అంత్యక్రియలు సోమవారం ములుగు మండలం మల్లంపల్లిలో ఘనంగా జరిగాయి. జగదీశ్ ఆదివారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడువగా, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ మల్లంపల్లిలోనే ఉండి అంత్యక్రియలు పూర్తయ్యేవరకు కుటుంబసభ్యులతో ఉండి ధైర్యాన్నిచ్చారు. అంతిమ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరై జగదీశ్ పార్థివ దేహంపై పూలమాల వేసి, బీఆర్ఎస్ జెండా కప్పి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నీతానై జగదీశ్ అంతిమయాత్రలో ముందుకు కదిలారు.
గొప్ప నాయకుడు జగదీశ్వర్ : మంత్రి కేటీఆర్
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్రం ఏర్పడి అభివృద్ధి చెందే వరకు సీఎం కేసీఆర్ అప్పగించిన ప్రతి పనిని కుసుమ జగదీశ్వర్ ఓ సైనికుడిగా పనిచేసి విజయవంతం చేశారని మంత్రి కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్లో ఎంపీలు జోగినపల్లి సంతోష్కుమార్, రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి ములుగుకు చేరుకున్న మంత్రి కేటీఆర్కు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ గౌస్ ఆలం, ప్రభుత్వ చీఫ్విప్ ధాస్యం వినయ్భాస్కర్, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్రావు, ఇతర ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి మంత్రి కేటీఆర్ రోడ్డు మార్గంలో ప్రత్యేక కాన్వాయి ద్వారా మల్లంపల్లికి చేరుకొని జగదీశ్వర్ పార్థివదేహం వద్ద నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.
జగదీశ్వర్ తండ్రి ఆదినారాయణ, భార్య రమాదేవి, కుమారుడు, కుమార్తెను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం విలేకరులతో కేటీఆర్ మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో తనతో పాటు చురుగ్గా పాల్గొన్న జగదీశ్వర్ అకస్మాత్తుగా చనిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆయన ఇంత చిన్నవయస్సులోనే దూరం కావడం దురదృష్టకరమని, ఆయన కుటుంబానికి తనతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. జగదీశ్వర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఉద్యమంలో పేరు మాత్రమే సం పాదించుకున్న నేత జగదీశ్వర్ అని, ఆస్తి పాస్తులు కూడబెట్టుకోని గొప్ప నాయకుడని కొనియాడారు.
పూర్తయ్యే వరకూ ఇక్కడే
జగదీశ్వర్ మృతి విషయం తెలియగానే మల్లంపల్లికి చేరుకున్న రైతు బంధు సమితి అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదివారం మొదలుకొని సోమవారం జగదీశ్వర్ అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శ్రెడ్డి దగ్గరుండి కార్యక్రమంలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయించారు. ఉదయం 10:45గంటలకు ప్రారంభమైన జగదీశ్ అంతిమయాత్ర రెండు గంటల పాటు కొనసాగింది.
మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, పువ్వాడ అజయ్కుమార్, గుంటకండ్ల జగదీశ్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పీవీ ప్రభాకర్రావు, ఎంపీలు మాలోతు కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బస్వరాజు సారయ్య, తాతా మధు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, అరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, శంకర్నాయక్, సీతక్క, బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కృష్ణమోహన్రావు, కార్పొరేషన్ చైర్మన్లు ఏరువ సతీశ్రెడ్డి, గ్యాదరి బాలమల్లు, మేడే రాజీవ్సాగర్, జడ్పీచైర్మన్లు గండ్ర జ్యోతి, అంగోతు బిందు, సంపత్రెడ్డి, ములుగు జడ్పీవైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై కుసుమ జగదీశ్వర్ పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో భాగంగా జగదీశ్వర్ పార్థివ దేహానికి మంత్రి సత్యవతిరాథోడ్, ఎంపీ కవిత స్నానం చేయించారు. అంతిమ యాత్రలో పల్లా రాజేశ్వర్రెడ్డి, సత్యవతిరాథోడ్ పాల్గొని పాడెను మోశారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజల అశ్రునయనాల నడుమ డప్పు చప్పుళ్లతో అంతిమయాత్రగా తీసుకెళ్లి జగదీశ్ పార్థివ దేహాన్ని ఖననం చేశారు.