వరంగల్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖల మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం హైదరాబాద్లోని సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది హాజరై అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి అటవీశాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పథకాలు, పనులపై అటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్ఎం డోబ్రియల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్గ్రేషియా పెంపుపై మంత్రి సురేఖ తొలి సంతకం చేశారు. ప్రస్తుతం రూ.5 లక్షలుగా ఉన్న పరిహారాన్ని ప్రభుత్వం రూ.10లక్షలకు పెంచింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి.
వివిధ కార్యక్రమాలు, ఉత్సవాలకు ఏనుగులను ఇతర రాష్ర్టాల నుంచి తెచ్చుకునేందుకు అనుమతి ఇస్తూ మంత్రి మరో ఫైలుపై కూడా సంతకం చేశారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు జరిగిన పచ్చదనం పెంపు, వచ్చే ఏడాది లక్ష్యాలపై మంత్రి సురేఖ ఆరా తీశారు. కంపా నిధుల సాధన, ఈ పథకం ద్వారా చేపట్టిన పనులను ఆమె అడిగి తెలుసుకున్నారు. తాను నిత్యం అందుబాటులో ఉంటానని, తన పరిధిలోని శాఖల అధికారులు, సిబ్బంది నిజాయితీగా పనిచేయాలని, ఐక్యంగా పనిచేసి లక్ష్యాలు సాధిద్దామన్నారు. పర్యావరణ రక్షణ, పచ్చదనం పెంపుపై అందరూ కార్యసాధకులుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. శాఖల వారీగా పూర్తి స్థాయి సమీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల ముఖ్య నేతలు, అటవీ, పర్యావరణ, దేవాదాయ, కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులు, సిబ్బంది మంత్రి సురేఖకు శుభాకాంక్షలు తెలిపారు.