వరంగల్, జనవరి 12 (నమస్తేతెలంగాణ): భావితరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించడం మనందరి బాధ్యతని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. పచ్చదనం పెంపునకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తున్నామో నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి శుక్రవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని, అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల మన పరిసరాలు, గాలి, నీరు కలుషితం అవుతున్నదని మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగం తగ్గింపును విధిగా చేపట్టాలని సురేఖ పిలుపునిచ్చారు. తన సెక్రటేరియేట్ కార్యాలయంతోపాటు నివాసంలోనూ వీలైనంతగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నియంత్రించేందుకు నిర్ణయించామని తెలిపారు. ప్లాస్టిక్ బాటిల్స్కు బదులు గ్లాస్ బాటిళ్లు, లేదంటే స్టీల్ వస్తువుల వాడకాన్ని పెంచాలని మంత్రి సురేఖ సూచించారు.