వరంగల్, జూలై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ మరోసారి ఫైర్ అయ్యారు. తన శాఖలో ఆయన పెత్తనం ఏంటని నిప్పులు చెరిగా రు. కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఏకంగా సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గతంలో తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో కడియం శ్రీహరి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులను రెచ్చగొట్టి దుష్ప్రచారం చేశారని పేర్కొన్నారు.
ఆయన ఎన్ని కుట్రలు చేసినా పార్టీ రాష్ట్రనాయకత్వం, అధిష్టానం తన నిబద్ధత, నిజాయితీని గుర్తించటం వల్ల అవన్నీ విఫలం అయ్యాయని పేర్కొన్నారు. ఈ లేఖ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కలకలం రేపుతున్నది. వరంగల్ జిల్లా వర్గపోరు పతాకస్థాయికి చేరుకుందని, పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల బడబాగ్ని ఉన్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే అసలు కాంగ్రెస్ వర్సెస్ సైకిల్ కాంగ్రెస్గా వర్గపోరు చెలామణి అవుతున్నదనే అభిప్రాయాలున్నాయి. తాను ప్రాతినిధ్యం వహించే శాఖలో కడియం శ్రీహరి పెత్తనం ఏంటని? ఆమె నిప్పులు చెరిగారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని లేఖలో స్పష్టం చేశారు. అయితే, నేరుగా కలిసి చెప్పుకునే అవకాశం ఉన్నప్పుడు సీఎంకు మంత్రి సురేఖ లేఖ రాయటం వెనుక ఆంతర్యం ఏమిటని వాదన వినిపిస్తున్నది.
మళ్లీ మొదటికి…
రాజకీయాల్లో ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో మంత్రి కొండాసురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీకి చెక్పెట్టాలన్నదే ‘సైకిల్’ కాంగ్రెస్ వర్గం ప్రధాన ఉద్దేశమని చెప్పుకుంటున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), పరకాల, స్టేషన్ఘన్పూర్, భూపాలపల్లి ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావుతోపాటు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి వీరిది పూర్వాశ్రమ టీడీపీ అని, ముఖ్యమంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితోడు అయ్యారని, వీరంతా కలిసి తమను అణగదొక్కుతున్నారని గాంధీభవన్ వేదికగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి బాహాటంగా ఆరోపించిన విషయం తెలిసిందే.
తమ ఎదుగుదలను నిరోధించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కావాలనే ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ మాజీ మేయర్ గుండు సుధారాణి తదితరులను ఉసిగొలిపి తమవర్గాన్ని చిన్నాభిన్నం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసినా అవి పెద్దగా ఫలితం ఇవ్వలేదనే విషయాన్ని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు నివేదించిన విషయం తెలిసిందే. కాగా, తాజా పరిణామం జిల్లా రాజకీయాలను ఎటువైపు మలుపు తిప్పుతుందోననే ఆసక్తి నెలకొన్నది.