జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాకు నర్సంపేటలో ఏర్పాటు చేయనుంది. ఈమేరకు రూ.183కోట్లు మంజూరు చేయగా జిల్లా ఆస్పత్రి మైదానంలో ఈ భవన నిర్మాణ పనులతోపాటు రూ.23కోట్లతో చేపట్టే 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్న ఈ కార్యక్రమ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇక్కడే 250 పడకల జిల్లా దవాఖాన భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి.
వరంగల్, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ) : సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వీటిలో వైద్యరంగం ఒకటి. దీనికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వరంగల్ను హెల్త్ సిటీగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైంది. ఇందులోభాగంగా రూ.1,200 కోట్లతో వరంగల్లో 24 అంతస్తులతో 2,100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మిస్తున్నది. దేశంలో అతిపెద్దది కాబోతున్న ఈ దవాఖాన నిర్మాణ పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. త్వరలో ప్రారంభమయ్యే ఈ హాస్పిటల్లో 36 విభాగాల ద్వారా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఇదే సమయంలో జిల్లాలో నర్సంపేటను హెల్త్ హబ్గా మార్చే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఈ క్రమంలో తాజాగా నర్సంపేటలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు రంగంలోకి దిగింది. దేశంలో మరెక్కడా లేని విధంగా జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కళాశాల నెలకొల్పుతున్న తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వరంగల్ జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తూ జీవో నెంబర్ 83 విడుదల చేసింది. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చొరవతో ఈ కళాశాలను నర్సంపేటలో స్థాపించేందుకు నిర్ణయించింది. కొద్దిరోజుల క్రితం ఇక్కడ మెడికల్ కళాశాల భవనాల నిర్మాణం కోసం రూ.183 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పాలనపరమైన ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. దీంతో రహదారులు, భవనాల (ఆర్అండ్బీ) శాఖ ఈ నిధులతో నిర్మాణ పనులు చేపట్టడానికి టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది.
నర్సంపేటలోని జిల్లా ఆసుపత్రి గ్రౌండ్లో గురువారం ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు శంకుస్థాపన చేయనున్నారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బస్వరాజ్ సారయ్య పాల్గొంటారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి హాజరు కానున్నారు. నర్సంపేటలోని జిల్లా ఆసుపత్రి గ్రౌండ్లో ఈ సందర్భంగా 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవల రూ.23 కోట్లు మంజూరు చేసింది.
జిల్లా ఆసుపత్రి నిర్మాణం
నర్సంపేటలో గత ఏడాది ప్రభుత్వం 250 పడకల జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి రూ.56 కోట్లు మంజూరు చేసింది. దీని కోసం ఇక్కడ పాకాల రోడ్డులో పది ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఆరంభంలో తలెత్తిన కొన్ని అడ్డంకులను స్థానిక ఎమ్మెల్యే పెద్ది క్షేత్రస్థాయిలో పరిష్కరించారు. వైద్యారోగ్యశాఖలోని టీఎస్ఎంఎస్ఐడీసీ రూ.56 కోట్లతో టెండర్ల ప్రక్రియ నిర్వహించి జీ ప్లస్ టూ జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టింది. మూడు బ్లాక్లుగా ఈ హాస్పిటల్ నిర్మించేందుకు టీఎస్ఎంఎస్ఐడీసీ ఇంజినీర్లు డిజైన్ చేశారు. ఏ బ్లాక్ను జీ ప్లస్ వన్, బీ, సీ బ్లాక్లను జీ ప్లస్ టూ నిర్మించే పనులు ప్రారంభించారు. ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 1.60 లక్షల చదరపు అడుగులకుగాను ఇప్పటికే 60 శాతం వరకు పనులు జరిగినట్లు టీఎస్ఎంఎస్ఐడీసీ ఇంజినీర్లు వెల్లడించారు. ఏ బ్లాక్లో రెండు, బీ బ్లాక్లో రెండు, సీ బ్లాక్లో మూడు స్లాబులు వేయటం పూర్తయిందని, బీ బ్లాక్లో మాత్రమే ఒక స్లాబ్ వేయాల్సి ఉందని తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఈ హాస్పిటల్ను సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులతో సమీక్ష జరిపి సాధ్యమైనంత త్వరలో నిర్మాణ పనులను పూర్తి చేయాలని చెప్పారు. ఈ క్రమంలో వచ్చే మార్చి వరకు నర్సంపేటలో 250 పడుకల జిల్లా దవాఖాన నిర్మాణ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు తెలిపారు.
50 నుంచి 250 పడకల స్థాయికి..
నర్సంపేటలో ప్రస్తుతం 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) పని చేస్తున్నది. అనూహ్యంగా ప్రభుత్వం ఈ ఆసుపత్రి స్థాయి పెంచుతూ ఇక్కడ 250 పడకల జిల్లా ఆసుపత్రిని మంజూరు చేసింది. నిధులు రూ.56 కోట్లు కేటాయించడంతో జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం నర్సంపేటలో డయాలసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంకు, ఉపశమన సంరక్షణ వార్డు వంటివి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఏడాది క్రితం టీ-డయాగ్నొస్టిక్ సెంటర్నూ ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లో 57 రకాల వ్యాధులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు రూ.1.25 కోట్లతో అవసరమైన పరికరాలను సమకూర్చింది. ప్రస్తుతం జిల్లాలోని పీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో ప్రజల నుంచి సేకరించిన నమూనాల పరీక్షలు నర్సంపేటలోని ఈ టీ-డయాగ్నొస్టిక్ సెంటర్లోనే జరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు కావడంతో వైద్యపరంగా ఇక్కడ వసతులు మరింత మెరుగు పడే అవకాశం ఉంది.