హనుమకొండచౌరస్తా/వరంగల్చౌరస్తా/కరీమాబాద్, మే 31: పేదలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు రాష్ట్ర మంత్రి హరీశ్రావు సూచించారు. బుధవారం నగరానికి వచ్చిన ఆయన ముందుగా హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో రూ. 1.25 కోట్లతో ఏర్పాటు చేసిన టీ డయాగ్నొస్టిక్ హబ్ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బస్వరాజు సారయ్య, మేయర్ సుధారాణి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి ప్రారంభించారు. వార్డుల్లోని పరికరాలను పరిశీలించారు. అనంతరం ఉర్సు బైపాస్రోడ్డులోని ఫాదర్ కొలంబో వైద్య కళాశాలను మంత్రులు ప్రారంభించారు.
ఇక్కడ హరీశ్రావు మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లే వైద్యరంగం బలోపేతమైందని స్పష్టం చేశారు. ఫాదర్ కొలంబో కల నేడు నెరవేరిందన్నారు. తెలంగాణలో కుల, మత భేదం లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. 60 ఏండ్లలో తెలంగాణలో మూడు ప్రభుత్వ కళాశాలలు ఉంటే 9 ఏండ్లలో 21కి చేరాయన్నారు. గతంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి 20 మెడికల్ కళాశాలలు ఉంటే నేడు 55కు చేరాయని, నాడు 2,950 ఉన్న ఎంబీబీఎస్ సీట్లు నేడు 8,340కి చేరాయని వివరించారు. వరంగల్ మూడు మెడికల్ కాలేజీల నగరంగా మారిందన్నారు. ఇవన్నీ సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమయ్యాయని చెప్పారు. భూపాలపల్లి, జనగామకు మెడికల్ కళాశాలలు వచ్చాయని, ములుగులోనూ వస్తుందన్నారు. ఫాదర్ కొలంబో వైద్యశాల ద్వారా పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ గత దవాఖానను మించి ఫాదర్ కొలంబో వైద్యశాల పని చేయాలని, ఇక్కడి ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తారనే నమ్మకంతోనే మంత్రి హరీశ్రావు వచ్చారని చెప్పారు.
కాకతీయ మెడికల్ కళాశాలలో అకడమిక్ బ్లాక్ భవనం ప్రారంభం
తెలంగాణ వైద్య సేవల, మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) పర్యవేక్షణలో రూ. 28.75 కోట్లతో కేఎంసీలో నిర్మించిన అకడమిక్ బ్లాక్ కొత్త భవనాన్ని మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయ మెడికల్ కళాశాల అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి పనులు చేపట్టాలని వైద్యాధికారులకు సూచించారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్దాస్ భవన విశేషాలను మంత్రికి వివరించారు. 300 మంది సామర్థ్యం కలిగిన నాలుగు లెక్చర్ హాల్స్, 500 మంది సామర్థ్యం కలిగిన ఎగ్జామినేషన్ హాల్ ఈ భవనంలో నిర్మించినట్లు తెలిపారు.
లెక్చర్ హాల్స్లో ఆడియో, విజువల్స్ పరికరాలను సుమారు రూ. 30 లక్షలతో 1981 పూర్వ విద్యార్థులు సమకూర్చినట్లు తెలిపారు. కార్యక్రమాల్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా షేక్, డీఎంహెచ్వో డాక్టర్ సాంబశివరావు, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, జీఎంహెచ్ సూపరింటెండెంట్ విజయ లక్ష్మి, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, 5వ డివిజన్ అధ్యక్షుడు బొల్లపెల్లి చందర్, మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్, 8వ డివిజన్ ఇన్చార్జి నలుబోలు సతీశ్, కార్తీక్, కానుగంటి అరవింద్, జీఎంహెచ్ ఆర్ఎంవో సారంగం, డాక్టర్ భార్గవ్, డెమో వేముల అశోక్, రవీందర్రెడ్డి, రమేశ్, బిషప్ తుమ్మబాల పాల్గొన్నారు.