జనగామ జిల్లా : పాలకుర్తి నియోజకవర్గం పరిధి కొడకండ్ల మండలంలోని మొండ్రాయి గ్రామంలో ఘనంగా బొడ్రాయి పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. గ్రామస్తులంతా ఐక్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. బొడ్రాయి పండుగ సందర్భంగా కోలాటాలతో, అమ్మవారి బోనాలతో ఘనంగా మంత్రికి స్వాగతం పలికారు. మంత్రి కూడా బోనం ఎత్తుకొని బొడ్రాయి వద్దకు మహిళలతో కలిసి నడిచారు.
మొండ్రాయి ఊరు చివర్లో ఉన్న దుర్గామాత గుడి వరకు గ్రామస్తులతో కలిసి వెళ్లి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బొడ్రాయికి పునః ప్రతిష్ఠి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బొడ్రాయి పండగ మన వెనుకటి సంప్రదాయమని, ఇలాంటి సంప్రదాయాలకు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసిఆర్ నాయకత్వంలో మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉన్నదన్నారు. మొండ్రాయి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తానని, గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానన్నారు. ఒక్క కాలువ నీళ్ళు వచ్చేది ఉండగా… వాటిని కూడా ఎండాకాలంలోపు తెచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.
గ్రామంలోని దుర్గామాత గుడి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొని కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. దుర్గామాత గుడి కట్టించడానికి అయ్యే ఖర్చు తాను భరిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో కాంగ్రెస్ నుంచి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరుతున్న వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో దౌపాటి ఎల్లయ్య, ఉపేందర్, సునీల్, వెంకన్న, ప్రశాంత్, కొండయ్య, పరశురాములు, దేవయ్య, రాము, లక్ష్మణ్, కిష్టయ్య, హరిబాబు, యాకన్న తదితరులు ఉన్నారు.