వరంగల్ : జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ బ్యాంకుల ద్వారా 2 వేల 744 కోట్ల రూపాయలు రుణాలు అందించాలని లక్ష్యం పెట్టుకోగా, లక్ష్యాన్ని అధిగమించి ఇప్పటివరకు 4 వేల 36 కోట్ల రూపాయలను అందించామని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి.. 1,233 కోట్ల రుణాలు వ్యవసాయ రంగానికి అందించాలని లక్ష్యంగా నిర్ణయించగా లక్ష్యాన్ని అధిగమించి 1,350.40 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చామని, అదేవిధంగా పరిశ్రమ రంగానికి 702 కోట్ల 80 లక్షల రూపాయలు రుణంగా అందించాలని లక్ష్యం పెట్టుకోగా.. రూ.754.80 కోట్లు అందించామని మంత్రి తెలిపారు.
మహిళా స్వయం సహాయక సంఘాల రుణాల మంజూరులో రాష్ట్రంలో వరంగల్ జిల్లా ప్రథమ స్థానం సాధించిందని మంత్రి స్పష్టం చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో 325 కోట్ల 13 లక్షల రూపాయలు రుణంగా అందించాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకూ లక్ష్యాన్ని అధిగమించి బ్యాంకులు 337 కోట్ల 37 లక్షల రూపాయలు రుణంగా ఇచ్చాయన్నారు.
వరంగల్ జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇంకా 45 రోజులు ముగుస్తుండగా, లక్ష్యాన్ని అధిగమించి వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు అందించటానికి సమన్వయంతో నిరంతరం కృషి చేసినందుకు జిల్లా కలెక్టరు, జిల్లా, మండల స్థాయి అధికారులు, బ్యాంకు అధికారులు, మేనేజర్లను మంత్రి అభినందించారు.
వరంగల్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన 12,668 మిరప పండ్ల తోటల రైతులు, 4342 మొక్కజొన్న, ఇతర పంటలు వేసిన రైతులందరికీ ఋణాలు రీషెడ్యూల్ చేసి కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని ఆయన బ్యాంక్ అధికారులను కోరారు.
అదే విధంగా వడగండ్ల వానకు నష్టపోయిన మిర్చీ, మొక్కజొన్న, ఇతర పంటలు వేసి నష్టపోయిన రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయాలని మంత్రి కోరారు. స్వయం సహాయక సంఘాలకు ఇచ్చిన రుణాలను కూడా రీషెడ్యూల్ చేయాలని మంత్రి కోరారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న దళిత బంధు కార్యక్రమం కింద ఎంపికైన లబ్ధిదారులకు సకాలంలో బ్యాంక్ అకౌంట్స్ తెరిచి గ్రౌండింగ్ చేయాలని బ్యాంక్ అధికారులను మంత్రి కోరారు.
14 ఫిబ్రవరి నుండి 18 ఫిబ్రవరి వరకు ఆర్బీఐ ఆర్ధిక అక్షరాస్యత వారోత్సావాలలో భాగంగా, అన్ని గ్రామీణ బ్యాంకు శాఖలలో గో డిజిటల్, గో సెక్యూర్ అనే నినాదంతో డిజిటల్ లావాదేవీలు, వాటి భద్రత గురించి అవగాహనా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, పీఎంఈజీపీ ముద్ర, స్టాండ్ అప్ ఇండియా ఋణాలను అర్హులైన వారికి అందజేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా మంజురైన ఎస్సీ కార్పొరేషన్ ఋణాలను 405 మందికి 35 కోట్ల లక్ష్యానికి 233 మంది లబ్దిదారులకు 19 కోట్ల మాత్రమే గ్రౌండింగ్ చేశారు. పెండింగ్ 175 పూర్తి చేయాలి. గిరిజన సంక్షేమం కింద 640 యూనిట్లు 40 కోట్లకు గాను 609 యూనిట్లు 39 కోట్లు గ్రౌండింగ్ పూర్తి చేశారు. పెండింగ్ యూనిట్లను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి అదేశించారు. ట్రైబల్ వెల్ఫేర్కు ఈ సంవత్సరం లక్ష్యం 1118 యూనిట్లు 31 కోట్లు ఋణాలు మంజురు చేయాలని చెప్పారు. మినీ డైరీ పథకం కింద ఎస్సీ కార్పోరేషన్ ద్వారా ఒక్కొక్కరికి రెండు గేదలు చొప్పున రాయపర్తి, నల్లబెల్లి, నెక్కొండ మండలాలకు బ్యాంకర్స్ ముందుకు వచ్చి మంజూరు చేయాలన్నారు. మినీ డైరీ పథకం క్రింద రెండు గేదెలు ఇచ్చిన వారికి మిగతా రెండు గేదెలను ఇవ్వాలన్నారు.
గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వరంగల్ జిల్లాకు ప్రధానమంత్రి అవార్డు రావడానికి జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు కృషి చేయాలని మంత్రి కోరారు. జిల్లాలోని బ్యాంకర్లు వ్యవసాయ, పరిశ్రమ రంగాలకు ఇతోధికంగా రుణాలు ఇవ్వాలని నర్సంపేట ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. జిల్లాలోని బ్యాంకర్లు ప్రాధాన్యతా రంగాలకు నిర్ణీత గడువులోగా రుణాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గోపి కోరారు.