వరంగల్, ఆగస్టు 15 : అనాథ పిల్లలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారిని ప్రభుత్వం అక్కున చేర్చుకొని కన్నబిడ్డలుగా చూసుకునే గొప్ప విధానాన్ని త్వరలోనే అమలు చేస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో స్వాతంత్య్ర వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అనాథల కోసం చట్టాన్ని తీసుకువచ్చే యోచనలో ఉందన్నారు.
ప్రభుత్వమే వారికి అండగా నిలబడి, కుటుంబం ఏర్పడే వరకు సహకారం అందిస్తుందని చెప్పారు. అనాథకు అండగా తీసుకువస్తున్న చట్టం దేశంలోనే ఆదర్శ, అద్భుతమైన చట్టంగా నిలుస్తుందని తెలిపారు. మల్లికాంబ మనోవికాస కేంద్రం కొన్నేళ్లుగా అద్భుతంగా సేవలు అందిస్తోందన్నారు. దివ్యాంగులైన బాలలు దేశభక్తి పాటలు పాడుతూ వాటికి తగ్గట్టుగా చేస్తుండడం చూసి మంత్రి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.