మేడారం సమ్మక్క-సారలమ్మకు తిరుగువారం మొక్కులు చెల్లించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ప్రతి జాతర తర్వాత వచ్చే బుధవారం తిరుగువారం పండుగ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అమ్మవార్లకు పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. పూజా సామగ్రిని శుద్ధి చేసి భద్రపరిచారు. దీంతో అమ్మవార్ల మినీ జాతర పర్వం పరిసమాప్తమైంది.
మేడారంలో తిరుగువారం సందర్భంగా పూజారి సిద్ధబోయిన మునీందర్ ఇంటి నుంచి నీళ్లు, పసుపు, కుంకుమ, కంకణాలను తీసుకొని డోలివాయిద్యాల నడుమ సమ్మక్క పూజా మందిరానికి పూజారులు, వారి కుటుంబసభ్యులు చేరుకున్నారు. మినీ జాతర సందర్భంగా బయటకు తీసిన అమ్మవార్ల పూజా సామగ్రి, వస్ర్తాలను, సమ్మక్క దేవతను చిలుకల గుట్ట నుంచి తీసుకువచ్చే పూజారి కొక్కెర కిష్టయ్య నిష్టతో శుద్ధి చేశారు.
అనంతరం గుడిని శుద్ధి చేసి సమ్మక్క గద్దెను అలుకుపూతలు, ముగ్గులతో అలంకరించారు. పూజారులు మునీందర్, లక్ష్మణ్రావు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, పిల్లాపాపలు చల్లంగ ఉండాలని వేడుకున్నారు. తల్లుల పూజా సామగ్రిని భద్రపరిచారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అమ్మవార్ల మహాజాతరకు తిరిగి పూజా సామగ్రిని బయటకు తీస్తారు. వచ్చే ఆదివారం పూజారుల కుటుంబాలు వన భోజనాలకు వెళ్లనున్నాయి.
తరలివచ్చిన భక్తజనం
తిరుగువారం పండుగకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ర్టాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో స్నానాలు చేసి కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి తల్లుల గద్దెల వద్దకు చేరుకొని మొక్కులు చెల్లించారు. అమ్మవార్ల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి పూజలు చేశారు. గద్దెల పరిసరాల్లో విడిది చేసి సంతోషంగా గడిపారు.