చిరుధాన్యాల పంటల సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారు. మొదట 508 ఎకరాల్లో సాగు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం రాయితీపై విత్తనాలు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, అండు కొర్రలు, అరికెలు, సామలు, వరిగెలు, ఊదలు తదితర చిరుధాన్యాల పంటల సాగుకు రైతులను ప్రోత్సహించనున్నారు. ఇప్పటికే గ్రామం వారీగా రైతుల పేర్లతో ప్రాథమికంగా నివేదికలు కూడా తయారు చేశారు.
వరంగల్, డిసెంబర్ 9 (నమస్తేతెలంగాణ) : జిల్లాలో చిరుధాన్యాల పంటల సాగుకు వ్యవసాయశాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు. తొలుత 508 ఎకరాల్లో సాగు చేయడానికి యాక్షన్ప్లాన్ రూపొందించారు. సబ్సిడీపై చిరుధాన్యాల విత్తనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 2023ని ప్రపంచ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన దరిమిలా జనవరి నుంచి చిరుధాన్యాల పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ఆదేశాలతో ప్రణాళిక తయారు చేశారు. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, అండుకొర్రలు, అరికెలు, సామలు, వరిగెలు, ఊదల పంట సాగు ప్రతిపాదనలు పరిశీలించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఉషాదయాల్ వ్యవసాయశాఖ అధికారులతో సమావేశమై ఏ పంటను ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలనే అంశంపై చర్చించారు. అన్ని స్థాయిల అధికారులతో మాట్లాడిన తర్వాత సాగు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు.
జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, అండు కొర్రలు, అరికెలు, సామలు, వరిగెలు, ఊదలు తదితర చిరుధాన్యాల పంటల సాగులో రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రైతులకు యాబై శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సాగుకు పదిహేడు క్వింటాళ్లు అవసరమని వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపిన యాక్షన్ ప్లాన్లో పేర్కొన్నారు. తొలి విడుత 508 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయడానికి విత్తనాలు కేటాయించాలని, వీటితో రైతుల క్షేత్రాల్లోనే చిరుధాన్యాల పంటలపై రైతులకు ప్రదర్శనలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు చేశారు. రైతులకు అవగాహన కల్పించేందుకు, చిరుధాన్యాల ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకూ ప్రతిపాదనలు పంపారు. సాగుపై గ్రామాల్లో రైతులతో ర్యాలీలు, ఎగ్జిబిషన్ల నిర్వహణ కోసం అధికారులు సమాయత్తమవుతున్నారు. చిరుధాన్యాలను తృణధాన్యాలని కూడా అంటారు. ఆహార ధాన్యాల్లో చిన్న గింజ కలిగిన గడ్డిజాతి పంటలు ఇవి.
ప్రపంచవ్యాప్తంగా వీటిని ఆహారం, పశుగ్రాసం కోసం పెంచుతున్నారు. వీటిలో మిల్లెట్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. మిల్లెట్స్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరమైన ధాన్యంగా పరిగణించబడుతాయి. మిల్లెట్లలోని ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను నియంత్రించే శక్తివంతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రైతులు రెండో పంట సాగుకు రెడీ అవుతుండటంతో అధికారులు జనవరిలో జిల్లాలో చిరుధాన్యాల పంట సాగుపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే గ్రామం వారీగా రైతుల పేర్లతో ప్రాథమికంగా నివేదికలు కూడా తయారు చేశారు. ప్రభుత్వం నుంచి చిరుధాన్యాల విత్తనాలు జిల్లాకు వచ్చిన వెంటనే వీటిలో పేర్కొన్న రైతులకు యాభై శాతం సబ్సిడీపై అందజేసి పంట క్షేత్రాలు నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. సాగుపై మొదట రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాల్ చెప్పారు. జనవరి నుంచి రైతులు చిరుధాన్యాల పంటలను సాగు చేయవచ్చని, ఇవి మూడు నెలల పంటలుగా ఆమె తెలిపారు.
రాయితీపై వేరుశనగ విత్తనాలు
యాసంగి నూనెగింజల పంటల విస్తీర్ణం పెంచేందుకు రైతులకు విత్తనాలపై రాయితీ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వేరుశనగ కదిరిలేపాక్షి (కే-1812) సర్టిఫైడ్ విత్తనాలను జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ(ఎన్ఎస్సీ) ద్వారా సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. విత్తన గ్రామీణ పథకం(సీడ్ విలేజ్ స్కీం) నుంచి ఈ విత్తనాలపై ఒక కిలోకి రూ.36 సబ్సిడీ ఇస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాల్ వెల్లడించారు. కిలోకు రూ.56 చొప్పున రైతులు చెల్లిస్తే ఒక రైతుకు 60 కిలోల వేరుశనగ కదిరి లేపాక్షి(కే-1812) రకం సర్టిఫైడ్ విత్తనాలను అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ లెక్కన 60 కిలోల విత్తనం మొత్తం ధర రూ.5,520లో ప్రభుత్వం రూ.2,160 సబ్సిడీ ఇస్తుందని, రైతు రూ.3,360 చెల్లించాలని చెప్పారు. ఈ వేరుశనగ విత్తనాలను సబ్సిడీపై ఇచ్చేందుకు ఎన్ఎస్సీ అధికారులు సిద్ధంగా ఉన్నారని, హరిజన, గిరిజన రైతులకు ప్రత్యేక కోటా ఉందని పేర్కొన్నారు. పాస్బుక్ జీరాక్స్, ఆధార్కార్డు, కుల ధృవీకరణ పత్రం సమర్పించి రాయితీపై రైతులు ఎన్ఎస్సీ వరంగల్ మేనేజర్ నుంచి వీటిని పొందవచ్చని లేదా సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆమె తెలిపారు. వేరుశనగ పంటను రైతులు యాసంగి వరి మాగానుల్లో లేదా వేసవిలో జనవరి, ఫిబ్రవరి నెలలో కూడా నీరు ఉన్నచోట సాగు చేసి అధిక దిగుబడి పొందవచ్చని ఉషాదయాల్ చెప్పారు.