దేశానికే తలమానికం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్
18 నెలల్లో 20వేల మందికి పైగా ఉపాధి
వరంగల్ లాంటి నగరాలకు కంపెనీలు వరుస కడుతున్నయ్
మామునూరు ఎయిర్పోర్టును విస్తరిస్తాం
రన్వే పెంపు కోసం రైతులను ఒప్పించి భూ సేకరణ చేస్తాం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
పార్క్లో తొలి వస్త్ర పరిశ్రమల ప్రారంభం
‘కిటెక్స్’కు భూమిపూజ.. యంగ్వన్ కంపెనీ స్థల పరిశీలన
రూ.100 కోట్లతో మిషన్భగీరథ పనులకు శంకుస్థాపన
పరకాల అభివృద్ధికి రూ.10 కోట్లు ఇస్తామని వెల్లడి
అదనంగా డబుల్బెడ్రూం ఇండ్లు, దళితబంధు యూనిట్లపై హామీ
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్తో ఓరుగల్లుకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మెగా టెక్స్టైల్ పార్క్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, చీప్విఫ్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణితో కలిసి కిటెక్స్ కంపెనీ వస్త్ర పరిశ్రమకు శనివారం భూమి పూజ చేశారు. మిషన్ భగీరథ నీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేశారు. గణేశ ఎకో స్పేర్ కంపెనీ వస్త్ర పరిశ్రమలను ప్రారంభించారు. యంగ్వన్ కంపెనీ ఫొటో ఎగ్జిబిషన్, మామునూరు ఎయిర్ పోర్టును పరిశీలించారు. పార్కులో నిర్వహించిన సభ, హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ను అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దుతామన్నారు.
వరంగల్, మే 7 (నమస్తేతెలంగాణ)/హనుమకొండ/గీసుగొండ :
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్తో ఓరుగల్లుకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో శనివారం ఆయన పర్యటించారు. మెగా టెక్స్టైల్ పార్క్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా పార్కు ఆవరణలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పరకాల నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో, తర్వాత హనుమకొండ రాంనగర్లోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి రామన్న మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 1300 ఎకరాల్లో ఏర్పాటు చేసుకున్న దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్ట్స్టైల్ పార్కులో మొట్టమొదటి యూనిట్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కిటెక్స్ కంపెనీ పిల్లల దుస్తుల తయారీలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సంస్థ అని, పార్కులో రూ.1,600 కోట్ల పెట్టుబడులు పెడుతున్నదని, తద్వారా 15 వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు.
సౌత్కొరియాకు చెందిన యంగ్వన్ కంపెనీ ప్రపంచ ప్రఖ్యాతి కలదని, పెద్ద బ్రాండ్స్ ఎన్నింటినో ఉత్పత్తి చేస్తున్నదని చెప్పారు. యంగ్వన్ కంపెనీ ఇక్కడ రూ.1,100 కోట్ల పెట్టుబడులు పెడుతున్నదని, తద్వారా 10వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఈ కంపెనీ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో 8 నుంచి 11 యూనిట్లను నెలకొల్పనుందని వివరించారు. గణేశ ఎకో స్పేర్ లిమిటెడ్ కంపెనీ ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి దారం తయారు చేసే వస్త్ర పరిశ్రమలను ఇప్పటికే నిర్మించిందని, రాష్ట్రవ్యాప్తంగా రోజూ 400 టన్నుల ప్లాస్టిక్ బాటిళ్లను సేకరిస్తుందని పేర్కొన్నారు. ఈ పార్కులో రానున్న 18 నెలల్లో 25 యూనిట్ల నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని, ప్రత్యక్షంగా 30 వేల మందికి, పరోక్షంగా మరో 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. కరోనా నేపథ్యంలో వస్త్ర వ్యాపర సంస్థలు సంక్షోభంలో పడడం, ప్రపంచ వ్యాప్తంగా టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఇబ్బందులు రావడంతో రెండున్నరేళ్లు బ్రేక్పడిందన్నారు. పార్క్ నిర్మాణానికి ఇద్దరే కారణమని, ఒకరు సీఎం కేసీఆర్ అయితే రెండో వ్యక్తి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అని పేర్కొన్నారు.చల్లా పట్టుదల వల్లే నేడు పార్కు నిర్మాణం అవుతున్నదని చెప్పారు.
వలసల నివారణకే..
సీఎం కేసీఆర్ కాకతీయ మెగా టెక్ట్స్టైల్ పార్క్ ప్రారంభం సందర్భంలో చెప్పినట్లుగా వరంగల్లోని అజంజాహీ మిల్లు మూతపడడంతో కార్మికులు వివిధ రాష్ర్టాలకు వలసలు వెళ్తున్నారని, వాటిని నివారించేందుకే మెగా పార్క్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. వలసల నివారణతో పాటు ఉమ్మడి వరంగల్కు ఉజ్వల భవిష్యత్ను తెచ్చేలా.. దేశానికే తలమానికంలా నిలిచేలా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు రూపుదిద్దుకుంటుందని తెలిపారు.
వరంగల్ లాంటి నగరాలకు కంపెనీలు
వరంగల్ లాంటి నగరాలకు ఐటీ కంపెనీలు వస్తున్నాయని, ఇప్పటికే మైండ్ట్రీ, జన్పాక్, టెక్ మహీంద్ర, సైయంట్, క్వాడ్రాట్ లాంటి కంపెనీలు వచ్చాయని చెప్పారు. వరంగల్ వాస్తవ్యుడు యూఎస్ఏలో 2005లో సాప్ట్పాత్ ఐటీ కంపెనీని స్థాపించి దశల వారీగా హైదరాబాద్, వరంగల్లో ఏడాది క్రితం ఏర్పాటు చేశారని, అందులో 250 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వివరించారు.
అనంతరం మామునూరు పోలీసు ట్రైనింగ్ కాలేజీలో అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగార్థుల కోసం నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి శిక్షణ పొందుతున్న వారితో మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టిన నేపథ్యంలో ఇలాంటి ఉచిత శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని యువతకు సూచించారు. కార్యక్రమాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీలు కవిత, పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్రెడ్డి, తాటికొండ రాజయ్య, నన్నపునేని నరేందర్, వొడితల సతీశ్ కుమార్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రెడ్యా నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్నాయక్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బస్వరాజు సారయ్య, తక్కళ్లపల్లి రవీందర్రావు, బండా ప్రకాశ్, మధుసూదనాచారి, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవారెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, వరంగల్ జడ్పీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచ్లు, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్లు, టీఆర్ఎస్ మండల, పట్టణ, గ్రామ, వార్డు, డివిజన్ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఎయిర్పోర్టును విస్తరిస్తాం
మామునూరు ఎయిర్పోర్ట్ విషయంలో హైలెవల్ కమిటీ సమావేశం నిర్వహించామని మంత్రి వివరించారు. ప్రస్తుతం 1.8 కిలో మీటర్ల రన్వే ఉందని, దాన్ని 3.9 కిలో మీటర్లకు పెం చాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని బోయింగ్ విమానాలు ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం ఇంకా 300 నుంచి 400 ఎకరాల భూమి కావాలని, ప్రస్తుతం మామునూరు ప్రాంతంలో భూముల ధరలు ఎక్కువ ఉన్నాయన్నారు. సమీపంలోని ప్రభుత్వ భూములను రైతులకు బదలాయించి గాని, లేదంటే రైతులను ఒప్పించి వారి సమ్మతితోనే భూమును సేకరిస్తామని చెప్పారు. కలెక్టర్ గోపి, ఎయిర్పోర్ట్ అథారిటీ, రెవెన్యూ అధికారులతో కలిసి స్థల సేకరణపై చర్చించారు.
పరకాలకు వరాలు
ఎమ్మెల్యే చల్లా వినతి మేరకు పరకాల మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.25కోట్లకు తోడు మరో రూ.10కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నియోజకవర్గానికి అదనంగా డబుల్బెడ్రూం ఇండ్లు, దళితబంధు యూనిట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. మెగా టెక్స్టైల్ పార్కుకు భూమి ఇచ్చిన వారికి ఈ పార్కులో లేఔట్ చేసి ఒక్కొక్కరికి 100 గజాల స్థలం ఇస్తామని ప్రకటించారు. పరిశ్రమల్లో కల్పించే ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఆయన ప్రకటించిన వరాలు టీఆర్ఎస్ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. మంత్రి కేటీఆర్ హామీలపై గులాబీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.