హనుమకొండ, అక్టోబర్ 12 : ‘ఎన్నికలు అనగానే ఆగం కావద్దు.. ప్రతి బూత్ కన్వీనర్ తానే అభ్యర్థి అనుకొని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోని అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలి’ అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శుక్రవారం హనుమకొండ స్నేహానగర్లోని ఎస్వీ కన్వెషన్ హాల్లో నిర్వహించిన వరంగల్ పశ్చిమ నియోజక వర్గం బూత్ కన్వీనర్ల సమావేశంలో చీఫ్ విప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూత్ కన్వీనర్లకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టేందుకు వరంగల్ పశ్చిమ నియోకవర్గం ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
పదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా అభివృద్ధి, సంక్షేమాన్ని జొడెద్దులుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిందన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను నియోజకవర్గంలోని ప్రతి గడపకూ తీసుకెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించాలని చీఫ్ విప్ సూచించారు. ఇప్పటి వరకు చేసిన ప్రగతిని ప్రజలకు నేరుగా వివరించే అద్భుతమైన అవకాశం మనకు దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకమై ఓట్లు అడగాలన్నారు. ప్రతి బూత్ కన్వీనర్ పార్టీ విజయానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. రేపటి నుంచి ఎన్నికలయ్యేంత వరకు బూత్ స్థాయిలో సంపూర్ణ బాధ్యత మీరే తీసుకోవాలన్నారు. సంక్రాంతికి గంగిరెద్దు వచ్చినట్లు.. ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బీజేపోళ్లు వస్తారని, వాళ్లను నిలదీయాలని సూచించారు. ఇప్పుడు ఒక చాన్స్ అని కాంగ్రెస్ అడుగుతోందని, ఇప్పటికే కాంగ్రెస్కు 11 అవకాశాలు ఇచ్చామని, అప్పుడు చేయలేని పనులు ఇప్పుడు చేస్తారా? అని ప్రశ్నించారు.
నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీలతో పాటు ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. ఆలోచించి పనిచేసే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరాలని చీఫ్ విప్ సూచించారు. సమావేశంలో కుడా చైర్మెన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జన్ను జకార్య, బూత్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.