ధర్మసాగర్, అక్టోబర్ 26 : రైతు బంధు పథకం పైసలు రైతుల ఖతాల్లో వేయవద్దని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం సిగ్గు చేటని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. ధర్మసాగర్ మండలంలోని రాయగూడెం, తాటికాయల, కరుణాపురం గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి కడియం శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతు బంధు పథకం నిలిపివేయాలని ఫిర్యాదు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందు కు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతోనే రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని నిలిపి వేయాలని ఫిర్యాదు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో ఎన్నికల ప్రచా రం కోసం వస్తే వారి తరిమికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను అమలు చేసే ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా ఉండాలని కోరారు. రైతుల సంక్షేమం కోసం ఇచ్చే రైతు బంధు పైసలు పంటల పెట్టుబడికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు.
దీన్ని జీర్ణీంచుకోలేని కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతులు సుభిక్షంగా ఉన్నారన్నారు. రైతులకు 24 గంటలూ కరెంటు, రైతు బీమా, సకాలంలో ఎరువులు, మందులు అందుతున్నాయన్నారు. ఈ పదేళ్ల కాలంలో ఎక్కడా కరెంటు కోసం, ఎరువుల కోసం ధర్నాలు చేసిన దాఖలాలు లేవన్నారు. ఇంత మంచి పాలన చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలిచి, మూడో సారి అధికారం కట్టబెట్టాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తే రాష్ట్రంలో అంధకారం ఏర్పడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. ఒక్క సారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించి, బీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరిని తాటికాయల గ్రామంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు, సర్పంచ్ పెసరు రమేశ్ గజమాలతో ఘనంగా సన్మానించారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు మునిగెల రాజు, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రాజేశ్వర్రెడ్డి, జీడ్పీటీసీ డాక్టర్ పీ శ్రీలత, సర్పంచ్లు రాజమణి, రమేశ్, అనిల్, యాకోబ్, ఎంపీటీసీలు సోమక్క, నాగయ్య, మాజీ ఎంపీపీ యాదగిరి, మాజీ ఎంపీటీసీ నాగరాజు, నాయకులు సిక రవి, సత్యనారాయణ, మొగిలి పాల్గొన్నారు.